దిగ్గజ ఐటీ రంగ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో తమ అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇప్పటికే ముంబయి, పూణే, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఉండగా, హైదరాబాద్ లో తమ నాలుగో మరియు అతిపెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వచ్చే 15 ఏళ్ల కాలంలో రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. సోమవారం హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఐటీశాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి, పలువురు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.15,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో దేశంలో మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా సెంటర్ పెట్టుబడికి హైదరాబాద్ గమ్యస్థానంగా ఉంటుందని ప్రకటించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ అభివృద్ధి కథలో ఇది ఓ ఐకానిక్ మూమెంట్ అని, అలాగే తెలంగాణ ఆకర్షించిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. స్థానిక వ్యాపార వృద్ధికి పరోక్షంగా ఈ డేటా సెంటర్ మద్దతు ఇస్తుందన్నారు. ఐటీ కార్యకలాపాలు, సౌకర్యాల నిర్వహణ, డేటా, నెట్వర్క్ భద్రత, నెట్వర్క్ ఇంజనీరింగ్ మరియు మరికోన్నింటిలో ఉద్యోగాల సృష్టిని సులభతరం చేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ తొలిదశ 2025 నాటికి అందుబాటులోకి రానుంది. ముందుగా తక్కువ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభం కానుండగా, దశల వారీగా అతి పెద్ద డేటా కేంద్రంగా అవతరిస్తుందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ