ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు బుధవారం నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి, జిడబ్ల్యుఎంసి మరియు రాష్ట్రంలోని అన్ని ఇతర మున్సిపాలిటీల్లో హై ఎక్స్పోజర్ కేటగిరీల్లో గుర్తించబడిన 6 లక్షల మందికి రాబోయే నాలుగు రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రాధాన్యత క్రమంలో 16,000 డయాలసిస్ మరియు తలసేమియా రోగులకు, మున్సిపాలిటీల పరిధిలో 3 లక్షల ఆటో మరియు క్యాబ్ డ్రైవర్లకు, ఇంజనీరింగ్ విభాగాలలో పనిచేస్తున్న 25,000 ఇంజనీరింగ్ సిబ్బందికి, పవర్ సెక్టార్లో 45,000 మంది ఫీల్డ్ సిబ్బందికి, వ్యవసాయ విభాగంలో 5,000 క్షేత్రస్థాయి ఉద్యోగులకు, రెవెన్యూ సంపాదించే విభాగాల్లో పనిచేస్తున్న 30,000 మంది క్షేత్రస్థాయి సిబ్బందికి, 6000 మంది ఐకెపి ఫీల్డ్ సిబ్బందికి, జిల్లాల్లో 15,000 మంది బ్యాంకు ఉద్యోగులకు, 13,000 మంది పోస్టల్ ఉద్యోగులకు, పట్టణ మరియు గ్రామీణ స్థానిక సంస్థలోని 60,000 మంది ప్రజా ప్రతినిధులకు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాక్టీస్ చేస్తున్న 35,000 ఆర్ఎంపీ, పిఎమ్పిలకు, 50,000 మంది పూజారి, ఇమామ్స్ మరియు చర్చి పాస్టర్ లకు కూడా కరోనా వ్యాక్సిన్ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ఇప్పటికే 16 లక్షల డోసులకు చెల్లింపులు జరిగాయని, వ్యాక్సిన్ సరఫరా వేగవంతం అయ్యేలా చూడటానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి, ప్రజారోగ్యం డైరెక్టర్ శ్రీనివాస్ రావు, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి మరియు సీఎం ఓఎస్డి డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ