తెలంగాణలో ఎన్నికలకు మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడబోతోంది. నవంబర్ 30న జరగనున్న పోలింగ్తో.. తమ ఓట్లతో ఓటర్ దేవుడు అభ్యర్థి జాతకాలను తేల్చేయనుండటంతో అన్ని పార్టీలలో గుబులు మొదలయింది. ఇప్పటికే ఎన్నికల సంఘం పోలింగ్ బూత్ల వద్ద నుంచి పోలింగ్ సక్రమంగా జరగడానికి కావాలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో అభ్యర్థులతో పాటు చాలా మందిలో ఏ జిల్లాలో పార్టీ గెలుస్తుంది.. ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తాడు? తెలంగాణలో అధికారం చేజిక్కించుకునే వాళ్లెవరూ అంటూ ఉత్కంఠ మొదలయింది.
తెలంగాణలో ఓటరు నాడి ఎలా ఉందంటూ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఒకటే ప్రశ్న వినిపిస్తోంది. కార్పొరేట్ ఆఫీసుల నుంచి ప్రభుత్వ ఆఫీసుల వరకూ, స్కూలు నుంచి యూనివర్శిటీ వరకూ తెలంగాణ ఎన్నికల గురించి చర్చలే వినిపిస్తున్నాయి. అంతెందుకు అధికారి స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ఎవరు తారసపడినా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారంటావు అనడానికే పలకరింపులు ఉంటున్నాయి. తెలంగాణ మొత్తంగా ఎక్కడ చూసినా రాజకీయ వాతావరణమే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న ఎన్నికల కోడ్తో ప్రభుత్వ స్థాయిలో ఏ కొత్త కార్యక్రమాలు కూడా జరగడం లేదు. దీనికితోడు రైతు బంధు మళ్లీ బ్రేక్ పడటంతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలకు సంబంధించి.. కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే కార్యక్రమం, లబ్థి చేకూర్చే కార్యక్రమాలకు కూడా బ్రేక్ పడింది. దీంతో బిజీబిజీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులకు.. కాస్త విశ్రాంతి దొరికినట్టయ్యింది. దీంతో అక్కడ కూడా ఎన్నికల ఫలితాల పైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మూడో సారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరుసగా రెండుసార్లు కూడా కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో… ఇప్పుడు మూడోసారి కూడా గెలుపుపై అదే ధీమాను వ్యక్తం చేస్తోంది. అదే ధీమాతో అభ్యర్థులను ప్రకటించడం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం వరకూ అన్నీ ముందే ప్రారంభించింది. తర్వాత లేటుగా బరిలో దిగినా లేటెస్టుగా దిగనట్టుగా కాంగ్రెస్, బీజేపీలు కూడా ఓటర్లను ఆకట్టుకునే హామీలను గుప్పించాయి.
దీంతో తెలంగాణలో ఈసారి గెలుపుపై విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని కొందరంటే .. కేసీఆర్ ప్రభుత్వంతో విసిగిపోయిన జనాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసం చూస్తున్నారని మరికొందరు అంటున్నారు. అలాగే ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది పక్కాగా కాంగ్రెస్ పాగా వేసేస్తాదని కొంతమంది అంటే..ఇప్పటి వరకూ సీఎం సీటు కోసమే కొట్టుకుంటున్న పార్టీ నేతలు.. రేపు ప్రజలను ఏం పాలిస్తారు అందుకే కాంగ్రెస్ రాదని మరికొంతమంది అంటున్నారు. మరోవైపు బీజేపీ అధికారంలోకి రాకపోయినా రెండు పార్టీలను బాగా దెబ్బకొట్టడంలో మాత్రం కీ రోల్ పోషిస్తుందని కొందరు అంటున్నారు.
దీంతో ఓటరు నాడిని అంచనా వేయడానికి అంతా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటరు నాడి ఎలా ఉందో.. పార్టీల మేనిఫెస్టోలు ఎంత వరకూ అమలు జరిగే అవకాశాలున్నాయో లెక్కలు వేస్తున్నారు. ఏ అభ్యర్థిని నమ్మి రేపు ఓటేయొచ్చన్న చర్చలు ఓవైపు .. ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందన్న చర్చోపచర్చలు మరోవైపు తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్ధికి గెలిచే అవకాశాలున్నాయో ఫోన్లు చేసి మరీ ఎంక్వైరీలు చేస్తున్నారు. మరోవైపు సందిట్లో సడేమియాలా బెట్టింగ్లు కూడా షురూ అయిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్పైనే ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 3 లోపు బెట్టింగ్ల జోరు మరింత పెరిగే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE