తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వరిధాన్యం ఉత్పత్తి పెరుగుతూ వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతన్నల కోసం చేపట్టిన రాష్ట్రంలోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, వాగులు, నదులపై చెక్ డ్యాముల నిర్మాణం వలన రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భూగర్భ నీటి వనరుల అభివృద్ధి చెంది, రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల వారి ధాన్యం ఒక సీజన్లోనే పండుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికీ సిద్ధిపేట జిల్లాలో లక్ష నుండి లక్షన్నర మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగుకాగా, ప్రస్తుతం ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు. వరి ధాన్యానికి క్వింటాలకు 2060 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని అమ్ముకోవాలని మంత్రి సూచించారు. ధాన్యం ఎండేలా కోసిన వెంటనే రెండు రోజులు పొలంలో ఎండబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, వరిధాన్యం కొన్న మూడు రోజుల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం నిధులను సమకూర్చిందన్నారు. గడిచిన యాసంగి కాలంలో వరిధాన్యాన్ని కొనమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే నూకలు ఎక్కువగా వస్తాయని రాష్ట్రంలోని ప్రజలతో నూకలు తినిపించాలని కేంద్ర మంత్రులు అవమానించారన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసి వారం రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిందని తెలిపారు.
ఈ వానకాలం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒక కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, తెలంగాణ రాష్ట్రం దేశానికి ధాన్యగారంగా మారిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో త్వరగా కొనుగోలు చేసేలా మరియు రైస్ మిల్లులో ధాన్యం దింపుకోవడానికి తరుగు ఇతరత్రా పేరుతో ఇబ్బంది పెట్టకుండా త్వరగా దింపుకునేలా, రైతులకు త్వరగా పేమెంట్ అందేలా ఆర్డీవోలు, తహసిల్దార్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, ఐకెపి సిబ్బంది పర్యవేక్షించాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE