తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక యొక్క ఓట్ల లెక్కింపు ప్రక్రియ రేపు (నవంబర్ 6, ఆదివారం) జరగనుంది. తెలంగాణలో చాలా రోజుల తర్వాత మునుగోడు ఉపఎన్నిక ఆసక్తికరంగా సాగడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకుంది. మునుగోడు ఓట్ల లెక్కింపు కోసం నల్గొండ పట్టణ శివారులోని ఆర్జాలబావి వద్ద ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గౌడౌన్స్ లో ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా, ముందుగా నియోజకవర్గంలో నమోదైన 686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు.
మునుగోడు పోరులో మొత్తం 47 మంది బరిలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి కానుండగా, ఒకే హళ్లో 21 టేబుళ్లపై కౌంటింగ్ జరుగనుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ కేంద్రాల చొప్పున కౌంటింగ్ చేపట్టనున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు వెల్లడి కానుంది. ఇక గంటకు 3 నుంచి 4 రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండగా, పూర్తిస్థాయి కౌంటింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయి, ఎవరు విజయం సాధించారో ప్రకటన విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.
మునుగోడు ఉపఎన్నికలో రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదైంది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా, 93.13 శాతం అనగా 2,25,192 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. వీటితో పాటుగా మరో 686 పోస్టల్ ఓట్లు కూడా పోలయ్యాయి. కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ముందుగా తొలి రౌండ్ చౌటుప్పల్ మండలం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం నియోజకవర్గపరిధిలోని నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. మరోవైపు కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
మునుగోడు పోరులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ సహా వివిధ పార్టీలు, అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఇతర స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 47 మంది బరిలో నిలిచినప్పటికీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. మునుగోడులో ప్రజా తీర్పు ఎవరివైపు ఉండబోతుందో, ఏ పార్టీ జెండా ఎగురవేయబోతుందో మరికొన్ని గంటల్లో తేలనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE