తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం సిద్దిపేట పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని 14వ వార్డులో ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్లతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్ పాత్, 15వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పట్టణంలో ప్రతి రోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను రెండు రకాలుగా విడగొడుతున్నామని పేర్కొన్నారు. దీనిలో పొడి చెత్తను రీ-సైక్లింగ్ చేస్తున్నామని, 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
అలాగే 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రియ జీవ ఎరువు కూడా తయారు చేస్తున్నట్లు హరీష్ రావు వివరించారు. ఇప్పటి వరకూ 2,522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సీఎన్జీ గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రియ జీవ ఎరువు తయారైందని వెల్లడించారు. దీని వలన పట్టణంలో పారిశుధ్యం మెరుగుపడిందని, తద్వారా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు, వృద్ధులకు ఫించన్లు వంటివి త్వరలో సిద్దిపేటలో కూడా అందిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ