కామన్ వెల్త్ గేమ్స్-2022కి వెళ్లనున్న భారత బృందంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంభాషించారు. ఈ ఇంటరాక్షన్ కు అథ్లెట్లతో పాటు వారి కోచ్లు కూడా హాజరయ్యారు. అలాగే కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, క్రీడల కార్యదర్శి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, తమ ముందువారి మాదిరిగానే ప్రస్తుత అథ్లెట్స్ కూడా భారతదేశం గర్వపడేలా చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కామన్ వెల్త్ గేమ్స్ లో 65 మందికి పైగా అథ్లెట్లు తొలిసారిగా పాల్గొంటున్నారని, వారు అద్భుతమైన ప్రభావాన్ని చూపాలని ఆకాంక్షించారు. మీ హృదయంతో ఆడండి, కష్టపడి ఆడండి, పూర్తి శక్తితో ఆడండి మరియు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడండి అని ప్రధాని మోదీ అథ్లెట్స్ కు సలహా ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ చెస్ దినోత్సవం (జూలై 20) సందర్భంగా కామన్ వెల్త్ గేమ్స్ కు వెళ్తున్న భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జూలై 28 నుంచి తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అవినాష్ సాబ్లే (అథ్లెట్), అచింత షెలీ (వెయిట్ లిఫ్టర్), ట్రీసా జాలీ (బ్యాడ్మింటన్), సలీమా టెటే (హాకీ క్రీడాకారిణి), షర్మిల (షాట్పుట్, పారా అథ్లెట్), డేవిడ్ బెక్హాం (సైక్లిస్ట్) సహా పలువురు అథ్లెట్స్ తో ప్రధాని మోదీ సంభాషించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, తాను పార్లమెంట్ సమావేశాల్లో నిమగ్నమై ఉన్నందున వారిని వ్యక్తిగతంగా కలవలేకపోయానని అన్నారు. ఈవెంట్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చినప్పుడు వారిని కలుస్తానని, వారి విజయాన్ని కలిసి జరుపుకోవచ్చని ప్రధాని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాలం భారత క్రీడా చరిత్రలో ఒక విధంగా అత్యంత ప్రధాన కాలమని ప్రధాని అన్నారు. నేడు క్రీడాకారుల్లో స్ఫూర్తి కూడా ఎక్కువగా ఉందని, శిక్షణ కూడా మెరుగుపడుతోంది మరియు క్రీడల పట్ల దేశంలో వాతావరణం కూడా అద్భుతంగా ఉందన్నారు. క్రీడాకారులంతా కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారని, ఇంకా మరింత ఎత్తులకు ఎదగాలని ప్రధాని మోదీ అన్నారు.
తొలిసారిగా అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వారి గురించి ప్రధాని మాట్లాడుతూ, కేవలం స్టేజ్ మాత్రమే మారిందని, విజయం కోసం స్ఫూర్తి మరియు మొండి పట్టుదల మారలేదని అన్నారు. “త్రివర్ణ పతాకం రెపరెపలాడడాన్ని చూడడం, జాతీయ గీతాన్ని వినిపించడం లక్ష్యం. అందుకే ఒత్తిడికి లోనుకాకండి, మంచి మరియు బలమైన గేమ్తో ప్రభావం చూపండి” అని ప్రధాని మోదీ సూచించారు. ఇక ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు కామన్ వెల్త్ గేమ్స్-2022 జరగనున్న విషయం తెలిసిందే. ఈ కామన్ వెల్త్ గేమ్స్-2022 లో భారత్ నుంచి మొత్తం 215 మంది అథ్లెట్లు, 19 క్రీడా విభాగాలలో 141 ఈవెంట్లలో పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY