తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం నాడు నగరంలోని ఫీవర్ ఆసుపత్రిలో 10.91 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కొత్త ఒపిడి బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. అలాగే ఈ సందర్భంగా 13 హార్సే వెహికల్స్, 3 అంబులెన్స్ ల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ రమేష్ రెడ్డి, ఐపీఎం డైరెక్టర్, ఫీవర్ హాస్పిటల్ ఇంఛార్జి శంకర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతిమీనా తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఫీవర్ ఆసుపత్రిలో ఈరోజు రూ.10.91 కోట్లతో కొత్త ఒపిడి బ్లాక్ ఏర్పాటు కోసం శంఖుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. దీంతో పాటు ఇదే వేదికగా 13 హర్సే వెహికల్స్ (పరమపద వాహనాలు), 3 అంబులెన్స్ లను ప్రారంభించుకున్నాం. దాతలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటగా ఈ హాస్పిటల్ ను విజిట్ చేశారని, హాస్పిటల్ అభివృద్ధి కోసం తక్షణమే 5 కోట్లు విడుదల చేశారని తెలిపారు. “ఫీవర్ ఆసుపత్రికి ఘనమైన చరిత్ర ఉంది. 1915లో క్వారంటైన్ సెంటర్ గా మొదలైంది. కాలక్రమేణా అది కొరంటి ఆసుపత్రిగా పేరుగాంచింది. అంటువ్యాధులు అనగానే ముందుగా ఫీవర్ హాస్పిటల్ గుర్తుకు వస్తుంది. ఓపి రోజుకు సగటున 500-600, సీజనల్ వ్యాధుల సమయంలో 1000 వరకు వస్తున్నారు. అందుకే కొత్త ఓపీడీ బ్లాక్ ను నిర్మించుకున్నాం. ఫీవర్ హాస్పిటల్ లో మార్చురీ అభివృద్ధికి 60 లక్షలు, రూ. 50 లక్షలతో డయాలసిస్ వింగ్ మంజూరు చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే అంబులెన్స్ కోసం 5-10 వేలు ఖర్చు అయ్యేది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ఉచితంగా పార్థివ వాహనాలను ప్రవేశపెట్టింది. మార్చురీలను అభివృద్ధి చేస్తున్నాం. 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ. 32.54 కోట్లు విడుదల చేసింది” అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్:
నిన్న పార్లమెంట్ లో దేశంలో ఏ రాష్ట్రాలు పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాయి అని ఒక ఎంపీ అడిగితే, 3వ స్థానంలో తెలంగాణ ఉందని కేంద్రం చెప్పింది. ప్రజా వైద్యంలో రూ.1690 తలసరి ఖర్చు చేస్తూ దేశంలోనే అగ్ర స్థానంలో ఉన్నాం. గాంధీ, ఓయూ, కోరంటి మీద లోడ్ పెరిగింది కాబట్టి సీఎం కేసీఆర్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం తలపెట్టారు. సమైఖ్య రాష్ట్రంలో కొత్త దవాఖానలు ఇవ్వలేదు. గతంలో ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి 2 లక్షలు మాత్రమే వచ్చేది. సీఎం కేసీఆర్ ఈ లిమిట్ ను 5 లక్షలకు పెంచారు. దవాఖానలో మందుల కొరత ఉండొద్దు. వైద్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ