నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి రైతు అవగాహన సదస్సులో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సాగు లాభసాటిగా మారాలని, అన్నదాత ఆత్మగౌరవంగా బతకాలనే రాష్ట్రంలో పంటల సాగులో కొత్త విధానం తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుత ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు, విత్తనాలు, ఎరువుల కొరత, విద్యుత్ కోత ఉండేదన్నారు. ఈ ప్రభుత్వం 1.40 లక్షల ఎకరాలకు 14వేల కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తున్నామని, వానాకాలం పంటకు సంబంధించిన 7 వేల కోట్ల రూపాయల్లో 3500 కోట్లు ఇప్పటికే వ్యవసాయ శాఖ ఖాతాలో జమ చేశామని చెప్పారు.
వానా కాలంలో మక్కల దిగుబడి తక్కువగా వస్తుంది. అది దిగుబడి వచ్చే సమయంలో వర్షం వస్తుంది. కాబట్టే వేసవిలో మక్కలు వేసుకోవాలి అని చెబుతున్నామన్నారు. ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, వచ్చే సంవత్సరం పత్తికి మంచి డిమాండ్ ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. అలాగే సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 25వేల ఎకరాల్లో రైతులు మక్కలు సాగు చేస్తున్నారు. రైతులు దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలన్నారు. ఎకరానికి కందుల ఉత్పత్తి ఎంత వచ్చినా, మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఒకే పంట వేస్తే క్రమంగా భూమిలో సారం తగ్గుతుంది. అందుకే పంటలు మార్చాలన్నారు.
ప్రస్తుతం జిల్లా అవసరాలకు అనుగుణంగా ఎరువులు తెప్పించాం. రైతులు ఎరువులు తక్కువగా వినియోగించాలని మంత్రి అన్నారు. ఇక రైతు బంధు వేదికల నిర్మాణం కోసం ప్రభుత్వం 20లక్షల రూపాయలు కేటాయించిందని, నాలుగు నెలల్లో నిర్మాణాం పూర్తి చెయ్యాలని, రైతు బంధు వేదికల నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని చెప్పారు. కొత్త వ్యవసాయ విధానంపై గ్రామ స్థాయిలో రైతులకు అవగాహన కల్పించేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఒకరికొకరు పోటీ పడి నూతన వ్యవసాయ విధానం ముందుకు తీసుకుపోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 20503 మంది రైతులకు ఒకే దఫాలో రుణ మాఫీ జరిగిందని, మిగిలిన రైతులకు సైతం దశల వారీగా మాఫీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu