తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చ్ 4 వరకు 10 రోజుల పాటుగా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించారు. అందులో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారాయణ రెడ్డి కాలనీని ఆయన సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ, కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా అని మంత్రి అడిగగా, రోజు విడిచి రోజు వస్తోందని మహిళలు అనడంతో మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కాలనీలో కరెంటు సమస్యలు ప్రస్తావించడంతో విద్యుత్ శాఖ అధికారులను పిలిచి కాలనీ వాసుల ముందే సమస్యల పరిష్కారనికి కృషి చేయాలని చెప్పారు.
ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్లు లేవని కొందరు మహిళలు చెప్పడంతో ఆర్డీవోను పిలిచి అర్హులైన అందరికీ సిలిండర్లు వచ్చేలా చూడాలని మంత్రి హరీశ్ రావు చెప్పారు. మరి కొందరు మహిళలు రేషన్ షాపు డీలర్ రేషన్ సరిగా ఇవ్వడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో నెలలో దాదాపు పది రోజుల పాటు రేషన్ సరఫరా చేయాలని ఆ సమయాన్ని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు. అక్కడి స్మశాన వాటికను కూడా మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. కాలనీ పర్యటన అనంతరం కాలనీ వాసులతో హరీష్ రావు సమావేశమయ్యారు. వారితో సమస్యలపై, వారి అవసరాలపై మాట్లాడించారు.
పల్లె ప్రగతి రెండు దశల్లో నిర్వహించిన అనంతరం గ్రామాల్లో చాలా మార్పులు వచ్చాయని, అదే తరహాలో పట్ణణాల రూపు రేఖలు మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి ప్రారంభించారని చెప్పారు. దశల వారీగా మున్సిపాలిటీ రూపురేఖలు మార్చుకుందామని అన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు హక్కులను, బాధ్యతలను మరింతగా పెంచిందన్నారు. పారదర్శకత, జవాబు దారీతనం కోసమే ఈ చట్టాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రజలకు అధికారం ఇచ్చిందని, కౌన్సిలర్ పని చేయకపోతే తొలగించే అధికారం కలెక్టర్ కు ఉంటుందన్నారు. 75 గజాలలో ఇంటి నిర్మాణానికి 1 రూపాయి కట్టి దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి అనుమతులు అవసరం లేదని తెలిపారు. అలాగే పది రోజుల్లో సంగారెడ్డి మున్సిపాలిటికీ ఎన్ని చెత్త సేకరణ బండ్లు కావాలో వాటిని కొనుగోలు చేస్తామని అన్నారు. ప్రభుత్వ స్థలాలు, ఖాళీ స్థలాల్లోను, ఇళ్ల ముందు చెట్లను పెంచమని ప్రజల్ని కోరారు. యువత 300 మొక్కలను నాటి వాటిని బతికిస్తే, వారికి కానుకగా ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయిస్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. మరోవైపు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్ లో, మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట పట్టణంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు.