వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీ ఆయనను సస్పండ్ చేసింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. సుమారు ఏడాదిన్నర పార్టీ కార్యాలయంలో కూడా అడుగు పెట్టలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకుంటారా అన్న చర్చలే. ఒకసారి టీడీపీలోకి.. మరోసారి బీఆర్ ఎస్ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలే. ఒక వేళ పోటీ చేస్తే సొంత పార్టీ నుంచా, ఇండిపెండెంట్గానా అన్న అనుమానాలే. వాటి అన్నింటికీ చెక్ పెడుతూ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేసి.. మళ్లీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో మొత్తం పార్టీ అభ్యర్థులు అందరూ ఓడిపోయినా ఆయన ఒక్కరే గెలిచి తన సత్తా చూపించారు. ఆయనే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.
రానున్న లోక్ సభ ఎన్నికల్లో గ్రేటర్ లో పార్టీ సత్తా చాటేలా ఇప్పుడు రాజాసింగ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియెజకవర్గానికి ఆయనను బీజేపీ ఇన్చార్జిగా నిలబెట్టడంతో పార్టీ నేతలతో నిత్యం భేటీ అవుతున్నారు. ప్రధానంగా మజ్లిస్ గెలుపునకు అడ్డుకట్ట వేసే వ్యూహాలు పన్నుతున్నారు. రాజాసింగ్ మొదటి నుంచీ ఎంఐఎం అంటే విరుచుకుపడతారు. ఆ పార్టీ నేతల స్టేట్ మెంట్లపై స్పందించి సరైన రీతిలో బదులిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా అసదుద్దీన్ కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఆయన ప్రభావం తగ్గించి, బీజేపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచేలా రాజాసింగ్ కసరత్తు చేస్తున్నారు. వరుసగా మూడు పర్యాయాలు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన సింగ్.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో సత్తా చాటి కింగ్ అనిపించుకోవాలని తహతహలాడుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించగా, గ్రేటర్ పరిధిలో ఒకే ఒకటి. రాజాసింగ్ మాత్రమే గెలిచారు. దీంతో మకమలం పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు చకచకా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్ లో తెలంగాణ నుంచి నలుగురు బీజేపీఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి వాటిని రెట్టింపు చేసేందుకు పట్టు బిగుస్తోంది. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడానికి ఆయా నియోజకవర్గాలకు బాధ్యుల(ఇన్చార్జి)ను నియమించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఇన్చార్జిగా నియమించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. సాధారణంగా రాజాసింగ్ హిందుత్వ ఎజెండాతో విస్తృత ప్రచారంలో ఉంటారు. పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అలాంటి రాజాసింగ్కు హైదరాబాద్ లోక్సభ బాధ్యతలు అప్పగించడంపై అందరి దృష్టి ఇప్పుడు హైదరాబాద్ఫై పడింది.
హైదరాబాద్ పార్లమెంట్ ఎప్పటి నుంచో మజ్లిస్ కంచుకోట గా నిలుస్తోంది. అక్కడ ఎవరు పోటీ చేసినా చేసిన అంతంత మాత్రమే. గతంలో దివంగత అగ్రనేతలు ఆలె నరేంద్ర, బద్దం బాల్రెడ్డిలో పోటీ చేసినప్పుడు ఇక్కడ బీజేపీ దీటుగా ఉండేది. దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీతో ఈ ఇద్దరు నేతలు తలపడ్డారు. ఆ స్థాయిలో హైదరాబాద్లో బీజేపీకి సమర్థుడైన అభ్యర్థి లేడు. దీనికితోడు మైనార్టీ వర్గాల ఓట్లు ఎక్కవగా ఉండడం, గంపగుత్తగా మజ్లిస్కే పడుతుండడంతో వరుసగా ఆ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తోంది. ఈసారి హైదరాబాద్లో పార్టీ బలాన్ని పెంచడానికి, ఓటు బ్యాంకును కూడగట్టుకోవడానికి రాజాసింగ్కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఆయన విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గం కూడా హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉండడంతో రాజాసింగ్కు అక్కడ పరిస్జితులు చక్కదిద్దడం కొంత సులువని పార్టీ వర్గాలు భావించినట్లు తెలిసింది. బాధ్యతలు అప్పగించిన నాటి నుంచీ రంగంలోకి దిగిన రాజాసింగ్.. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం, ఒకే తాటిపై ఉండేలా పార్టీని తీర్చిదిద్దడం, మజ్లిస్కు గ ట్టి పోటీఇచ్చేలా దృష్టి పెట్టారు. రానున్ ఎన్నికల్లో మజ్లిస్ కు బీజేపీ ఎంత వరకూ పోటీ ఇస్తుందో గెలిచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY