తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈరోజు బీబీ నగర్ లోని ఎయిమ్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్య సదుపాయాల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి భూములు, భవనాలు ఇచ్చి, అన్ని రకాల మద్దతు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయిందని, ఇంత పెద్ద సంస్థలో కేవలం 20 మంది ఐపీ పేషెంట్లు మాత్రమే ఉండటం నిరుత్సాహం కలిగిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్కు 200 ఎకరాల భూమిని కేటాయించిందని, కానీ కేంద్రం ఒక్క కొత్త భవనం కూడా నిర్మాణం చేయలేక పోయిందని అసహనం వ్యక్తం చేశారు. చివరకు అత్యవసరమైన బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయలేకపోయారని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉన్నా, ఎంబీబీఎస్ విద్యార్థులకు క్లినికల్ ప్రాక్టీస్ చేసే అవకాశం లేక యాదాద్రి జిల్లా ఆసుపత్రికి వెళ్తున్నారని హరీష్ రావు చెప్పారు. కేంద్రం బీబీ నగర్ ఎయిమ్స్లో ఇంత వరకు పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లను నియమించలేదని, మొత్తం 185 మంది ప్రొఫెసర్లు కావాల్సి ఉండగా అందులో సగం కేవలం 95 మందిని మాత్రమే నియమించారని మండిపడ్డారు. ఇక నర్సింగ్లో మొత్తం 812 నర్సింగ్ పోస్టులు ఉండగా 200 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇక్కడికి చాలాసార్లు వచ్చారని, కానీ ఏనాడూ సదుపాయాలపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఇకనైనా ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేయాలని, ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి తెలియజేసి పరిస్థితులు చక్కదిద్దాలని హరీష్ రావు కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ