ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 9వ తరగతి నుంచి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
‘‘ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో తొమ్మిదవ తరగతి నుండి ఆ పై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు నిర్వహించాలి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను నిర్వహించాలి. ఈ లోగా అన్ని విద్యా సంస్థలను, హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను, వాటిలోని టాయిలెట్లను సిద్ధం చేయాలి. అవన్నీ పరిశుభ్రంగా ఉండే విధంగా కలెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యా సంస్థలు నిర్వహించక చాలా రోజులు అవుతున్నది కాబట్టి అందులోని సామాగ్రినంతటినీ శుభ్రపరచాలి. అప్పుడు నిల్వ చేసిన బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలు, వంట సామాగ్రి పురుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాకును సరి చూసుకోవాలి. మొత్తంగా ఈ నెల 25 లోగా విద్యా సంస్థలను తరగతులు నిర్వహించడానికి అనుగుణంగా సిద్ధం చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర హాస్టళ్లను మంత్రులు సందర్శించి, విద్యార్థుల వసతికి అనుగుణంగా తీర్చిదిద్దాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మరోవైపు రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశాలు ఇచ్చారు. ధరణి పోర్టల్ లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు, కలెక్టర్లతో పాటుగా ప్రభుత్వ సలహాదారులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ