తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయింది. ఉదయం 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు దాదాపు 20 శాతం ఓటర్లు పోలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 స్థానాలకుగానూ నేడు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. 13 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
119 శాసనభ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో పురుషులు 2,068 మంది ఉండగా.. మహిళలు 221 మంది ఉన్నారు. వరంగల్ తూర్పు నుంచి ట్రాన్స్ జెండర్ పుష్పలత లయ పోటీ చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ మొత్తం 119 నియోజకవర్గాల్లో బరిలోకి దిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీకి దిగారు.
అటు కాంగ్రెస్ 118 స్థానాల్లో పోటీ చేస్తోంది. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ఆయా పార్టీలతో మంతనాలు జరిపింది. చివరికి సీపీఎంతో పొత్తు కుదరకపోగా.. సీపీఐతో కాంగ్రెస్ పొత్తు కుదిరింది. దీంతొ కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కట్టబెట్టింది. కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో.. సీపీఎం ఒంటరిగా 17 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ ఈసారి జనసేనతో కలిసి రంగంలోకి దిగింది. బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగిలిన 9 స్థానాల్లో జనసేన బరిలోకి దిగింది.
ఇకపోతే పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 1.85 లక్షల సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల వరకు గుంపులు గుంపులుగా ఉండొద్దని అధికారులు సూచించారు. ఇక ఎన్నికల బందోబస్తులో 65 వేల మంది తెలంగాణ పోలీసులు పాల్గొన్నారు. అటు 375 కంపెనీల సాయుధ కేంద్ర బలగాలను అధికారులు రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు .. మహిళా ఓటర్లు 1.63.. ట్రాన్స్జెండర్ ఓటర్లు 2,676 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 9,99,667గా ఉంది. దివ్యాంగుల కోసం అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 21,686 వీల్ చైర్లను సిద్ధం చేశారు. అలాగే 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇకపోతే డిసెంబర్ 3న ఓట్లను లెక్కించనున్నారు. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE