జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్రం సర్క్యూలర్ జారీ చేయడంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. “కేంద్రంలో ఉన్న మీ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి ఉపాధిని దెబ్బతీసింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపయోగకారిగా ఉన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం సర్క్యూలర్ (1).F.No.J11060/2/2021-RE-VI(374151), Dt.30.12.2021 and Dt.05.05.2022 మరియు (2).F.NoJ.11017/39/2017-RE-VII(E378816), Dt. 18.07.2022 జారీ చేయడం పేదల నోట్లో మట్టి కొట్టడమే. తెలంగాణ అభివృద్ధికి పూర్తి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న మీ నాయకత్వం, దేశంలోని కూలీలతో పాటు, తెలంగాణలో ఉన్న 57.46 లక్షల జాబ్ కార్డ్ కలిగిన 1,21,33,000 మంది ఉపాధి హమీ కూలీల హక్కులను కాలరాస్తోంది. దేశంలోని నిరు పేదలకు ఆదాయం, ఆహార భద్రత కల్పిస్తున్న పథకం ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని రద్దు చేసే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోంది. ఇంతకు ముందున్నెడు లేని రీతిలో తనిఖీలు ప్రారంభించింది. కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్లు, పేదల పాలిట కల్పతరువైన ఉపాధి హామీ పథకంపై అవినీతి ముద్ర వేసి రద్దు చేసే కుట్ర సాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కూలీలు చేసిన పనికి వేతనం చెల్లించకపోవడం దేనికి సంకేతం. దేశ వ్యాప్తంగా దాదాపు పదివేల కోట్ల రూపాయల వేతనాలు పెండింగ్ ఉన్నాయని స్వయాన కేంద్ర మంత్రి ఇటీవల రాజ్య సభలో చెప్పడం నిజం కాదా?, దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోనే 4700 కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 83 కోట్లు చెల్లించలేదని అంగీకరించడం వాస్తవం కాదా?, రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు ఇంకో విషయం చెప్పాలి. 2022-23 కేంద్ర బడ్జెట్లో ఉపాధి హమీ పథకానికి కేవలం 73 వేల కోట్ల నిధులను కేటాయించడం ఏంటి?, ఇందులో 18,380 కోట్లు గత ఏడాది చెల్లించాల్సిన బకాయి వేతనాలకే పోతాయి. ఇక మిగిలిన నిధులు ఉపాధి హమీ పథకం అమలుకు ఏ మూలకు సరిపోతాయి” అని ప్రశ్నించారు.
“2017-18 లో జరిగిన ఎకనమిక్ సర్వేలో యూనివర్సిల్ బేసిక్ ఇస్ కమ్ ను (UBI) ను ప్రతిపాదించింది మీ ప్రభుత్వమే కదా. ఆ సర్వే ప్రకారం దేశంలో 30 శాతం కుటుంబాలకు సంవత్సరానికి 72 వేల రూపాయల ఆదాయం కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టాల్సి ఉందని తేలింది. ఇలాంటి సమయంలో పేదల హక్కుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, అర్థం పర్థంలేని నిబంధనలు పెట్టి, నిధుల్లో కోత పెట్టి యూబీఐని ఎలా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డిని ఈ లేఖ ద్వారా కోరుతున్నాను. కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బకొట్టేవిధంగా ఉంది. ఉపాధి హామీ పని ఎక్కువగా ఎండాకాలంలో జరుగుతుంది. పనిచేసే వ్యక్తులు ఉదయం 10 గంటలలోపు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు ఒకసారి ఫోటోలు దిగి, అప్ లోడ్ చేయాలని సర్క్యులర్ లో చెప్పారు. ఎండాకాలంలో 8 గంటలపాటు పని చేయడం ఎలా సాధ్యం?, 8 గంటలు పని చేసినా అంతకు మించి పనిచేసినా అందే గరిష్ఠ కూలీ 257 రూపాయలు మాత్రమే. ఇంత చిన్న మొత్తం కూలీగా చెల్లించడానికి ఇన్ని నిబంధనలా?, 8 పని గంటలకు మీరు ఇచ్చే 257 రూపాయలతో ఆ కూలీలకు నిజంగా జీవనోపాధి లభిస్తుందా?, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సి ఉంది. పని దినాలను 300 రోజులకు పెంచాలని కోరుతున్నారు. కూలీలకు బీమా సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కూలీలు తమ శ్రమ ద్వారా దేశ సంపద పెంచే పనిలో భాగస్వామ్యులవుతుంటే ఆ పథకాన్ని రద్దు చేసే కుట్రకు కేంద్రం ఎందుకు తెరలేపిందో సమాజానికి కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ ఉదయం, సాయంత్రం హాజరు తప్పని సరి అని మీరు జారీ చేసిన సర్క్యులర్ దేశంలోని కూలీలందరినీ అవమానించడమే అవుతుంది. ఎర్రటి ఎండలో 8 గంటలు పని చేయడం సాధ్యమేనా?, ఈ అంశాన్ని శాస్త్రీయంగా పరిశీలించకపోవడం దారుణం” అని అన్నారు.
“ఎండాకాలం లేదా వానాకాలంలో పని చేసేటప్పుడు కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సదరు సర్క్యూలర్ లో పొందుపరచకపోవడం అమానవీయం కాదా?, పని చేసే వారిని అవమానపరిచేలా వర్క్ సైట్ లో ఉండి రోజుకు రెండు సార్లు మస్టర్ రోల్ అటెండెన్స్, ఫోటోలు అప్ లోడ్ చేయాలని సర్క్యూలర్ జారీ చేయడం గర్హనీయం. 17 ఏళ్ల నుండి ఈ పథకం అమలవుతుంటే ఎన్నడూ లేని విధంగా కొత్త బ్యాంకు అకౌంట్లు తీయాలని ఉపాధి కూలీలను వేధిస్తూ వేతనాలు చెల్లించడంలో మీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. ఉపాధి హమీ పథకం నుండి కూలీలను దూరం చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని రద్దు చేయాలన్న వ్యూహంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు స్పష్టమవుతోంది. పేదల పథకాలకు తూట్లు పొడుస్తూ, క్రమక్రమంగా వాటిని అటకెక్కించే రహస్య ఎజెండాతో కేంద్రం పని చేస్తోందని అర్థం అవుతోంది. ఇంతకంటే దారుణం ఏం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన ఫస్ట్ రన్నర్ అప్ ను ఈ పర్యవేక్షణలో భాగం చేయాలని పేర్కొన్నారు. సర్పంచ్ లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా ఓడిపోయిన వారందరికి ఈ పథకం పై పర్యవేక్షణ అధికారాలు కల్పించడం ఏంటి?, అసలు రన్నర్ అప్ అనే పదాన్ని వాడటం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే. ఓడిపోయిన ప్రజా ప్రతినిధులను వాట్సప్ గ్రూప్ లో చేర్చి ఎప్పటికప్పుడు కూలీలు చేసే పని సమాచారాన్ని వాట్సప్ ద్వారా అధికారులకు చేరవేయాలని సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఇది దేనికి సంకేతం? ఈ నిబంధన కూలీలు, ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు ఏ ప్రతిపాదికన అధికారాలు కట్టబెడతారు?, అధికారులు చేయాల్సిన పనిని వారికి అప్పగించడంలో మతలబు ఏంటి?, ఇందులో రాజకీయ కుట్ర కోణం లేకపోలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిన మీ పార్టీ ప్రతినిధులకు అధికారం కట్టబెట్టడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
“జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల పనులు చేపడుతున్నది. రైతులు దీని వల్ల లబ్ది పొందుతున్నారు. కానీ గ్రామంలో 20 పనులు మాత్రమే చేపట్టాలని కేంద్రం చెప్తోంది. దీని వల్ల కూలీలకు పనులను ఎంపిక చేసుకునే అవకాశం సన్నగిల్లుతుంది. మీ ఈ నిర్ణయాల వల్ల కూలీలు ఉపాధి హామీకి దూరం అవుతారు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం ద్వారా దేశ ప్రయోజనాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సర్క్యులర్లో పేర్కొన్న నిర్ణయాల వల్ల తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. భూమిలేని నిరుపేదలు, చిన్న సన్నకారు రైతులు ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడతాయి. తెలంగాణను దెబ్బతీసే కుట్రలో భాగంగా కేంద్రం ఇలాంటి స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ బిడ్డగా మీరు ఎలా సమర్థిస్తారు?, వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా కొర్రీలు పెట్టి, ఆ పథకాన్నే నిర్వీర్యం చేయాలన్న కుట్రకు ఇది నాంది పలుకుతున్నట్లు అర్థం అవుతోంది. ప్రజలకు మేలు చేసే వ్యవస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ, ప్రజల నోట్లో మట్టికొడుతున్న కేంద్ర ప్రభుత్వం, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు” అని మంత్రి హరీశ్ రావు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY