విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా పై జాతీయ స్థాయిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సదస్సులో పాల్గొన్న తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ,రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ట్రాన్స్కో మరియు జెన్కో సిఏండీ ప్రభాకర్ రావు, టిఎస్ఎస్పిడిసిఎల్ సిఏండీ రఘుమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ చట్ట సవరణ అంటేనే రాష్ట్రాల హక్కులను హరించి వేయడమేనని తేల్చిచెప్పారు. అత్యవసర సర్వీస్ ను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. కోవిడ్ తో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కం లకు ఇచ్చే రుణాల మీద ఒక శాతం తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 9.5%తో కాకుండా ఒక శాతం తగ్గించి 8.5% వడ్డీకే రుణాలు ఇవ్వాలని ఆయన కేంద్రానికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే విద్యుత్ చట్ట సవరణ చట్టం తెలంగాణ రైతాంగానికి గొడ్డలి పెట్టు లాంటిదని మంత్రి అభివర్ణించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదాపై కేంద్రానికి స్పష్టంగా లేఖ రాసిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం చేకూరక పోగా గృహ వినియోగదారులు సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును వ్యతిరేకిస్తూన్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోని మిగితా రాష్ట్రాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నా కూడా బిల్లులో సింగిల్ లైన్ కూడా మార్పుకు నోచుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పంజాబ్, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలు సైతం బిల్లును వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. విద్యుత్ రంగంపై రాష్ట్రాల హక్కులను కేంద్రం ఈ బిల్లు ద్వారా ఆధీనంలోకి తీసుకొని ప్రైవేట్ పెట్టుబడి దారుల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాలు అభ్యంతరం పెట్టిన అంశాలలో ఇఆర్సీ నియామక నిబంధనలలో మార్పులు చేశామని చెప్పారు కానీ అది చేతలలో జరగలేదని మంత్రి అన్నారు.
మరోవైపు భద్రాద్రి పవర్ ప్లాంట్ రెండో యూనిట్ 270 మెగా వాట్లు అనుసంధానించామని ఆయన ప్రకటించారు. ఈ రోజు నుండి అక్కడ ఉత్పత్తి ప్రారంభమైనట్లు వెల్లడించారు. దురదృష్టవశాత్తు కొందరు న్యాయస్థానాలలో కేసులు వెయ్యడంతో కొంత ఆలస్యమైందన్నారు. మూడో యూనిట్ ను కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. భద్రాద్రిలో పూర్తి స్థాయిలో అంటే 1080 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించ బోతున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu