ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి 20 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా బల్కంపేటలో రూ.3.60 కోట్ల తో నిర్మించిన వైకుంఠ ధామంను ప్రారంభించారు. తదనంతరం సనత్ నగర్ డివిజన్ లోని నెహ్రూ నగర్ లో 2.50 కోట్లతో నూతనంగా నిర్మించనున్న థీమ్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. అక్కడి నుండి లేబర్ వెల్ఫేర్ సెంటర్ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తో బ్యాడ్మింటన్ ఆడారు. అక్కడి నుండి మోండా మార్కెట్ డివిజన్ లోని గ్యాస్ మండీ లో రూ.2.40 కోట్ల తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, ఆదయ్య నగర్ లో రూ.3 కోట్ల రూపాయలతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని, మారేడ్ పల్లిలో రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు.
కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాల్లో సైతం ప్రజల మద్యనే ఉన్నాం:
సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మారేడ్ పల్లి లోని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రజల మేలుకోసం అనేక సంస్కరణలు, నూతన చట్టాలను తీసుకొస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించి ప్రోత్సహించాలని అన్నారు. కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాలలో సైతం తాము ప్రజల మద్యనే ఉన్నామన్న విషయం మీ అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. 6 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగర అభివృద్ధిపై అనేక అనుమానాలు, అపోహలు ఉండేవని, కాని వాటిని పటాపంచలు చేసేలా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగోద్దనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంకల్పం అన్నారు. నగరంలో జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి కేటిఆర్ చెప్పారు. గతంలో గల్లీకో క్లబ్, గుడుంబా క్యాంపు ఉండేవని, అవన్నీ ప్రభుత్వం మూసివేసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి స్వల్ప సమయంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధితో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు. లక్షాలాది రూపాయలు వెచ్చించి ఫంక్షన్ హాల్స్ కు వెళ్ళలేని పేదలను దృష్టిలో ఉంచుకొని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటిఆర్ చెప్పారు.
పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, మంత్రి కేటిఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 800 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇదే ప్రాంతం నుండి సీఎంగా ప్రాతినిద్యం వహించిన మర్రి చెన్నారెడ్డి హయంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కేవలం శిలాఫలకానికే పరిమితం అయిందన్నారు. ఈ ప్రాంత ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ పారిశ్రామిక వాడ లో అండర్ పాస్ నిర్మాణానికి, ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ కోసం అడిగిన వెంటనే 104 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. విజన్ ఉన్న నేత కేటిఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం మనందరి అదృష్టం అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించిందని, ఇంకా రాని వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ