ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అన్ని మతాలను గౌరవిస్తారని, ప్రజలందరి బాగు కోసం కృషి చేస్తూ ప్రగతిపథంలో నడిపిస్తున్నారని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సమీపిస్తున్నందున సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణ, గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ ఏర్పాట్ల గురించి మంత్రి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాడు అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో రూ. 1518 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. నగరంలో అధునాతన క్రిస్టియన్ భవనాన్ని నిర్మిస్తుండడాన్ని ప్రస్తావించారు.
క్రిస్మస్ సందర్భంగా 2.40 లక్షల మంది నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ:
ఆరేళ్ల నుంచి జరుపుతున్న మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రిస్టియన్లలోని 2.40 లక్షల మంది నిరుపేదలకు గిఫ్ట్ ప్యాక్ లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ గిఫ్ట్ ప్యాక్ లలో చీరలతో పాటు పంజాబీ డ్రెస్సులు, దుస్తులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో వీటిని వచ్చే నెల 12 నుంచి 15వ తేదీ వరకు, జిల్లాలలో 11వ తేదీ నుంచి 15వరకు పంపిణీ జరిగేలా పకడ్బంధీ ఏర్పాట్లు చేయాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. క్రిస్టియన్లకు సీఎం కేసీఆర్ ప్రతిఏటా ఇచ్చే విందు, జిల్లాలలో ఏర్పాటు చేసే విందులు కోవిడ్ నిబంధనల కారణంగా ఈసారి నిర్వహించడం లేదని మంత్రి వివరించారు.ఈ సందర్భంగా ఆయన పంపిణీ చేయనున్న చీరలను పరిశీలించారు. సమావేశంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి కాంతివెస్లీ, టిస్కో జాయింట్ డైరెక్టర్ యాదగిరి తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ