కోవిడ్-19 (కరోనావైరస్) ను అరికట్టడానికి కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కే.టి రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయగా,. వాటిలో జీహెఛ్ఎంసీ పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని చెప్పారు. మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జీహెఛ్ఎంసీ కార్యాలయం నుండి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేయాలని మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు మంత్రి కేటిఆర్ స్పష్టం చేశారు. పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలని సూచించారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలివరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వాలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకోవాలన్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఆ విధంగా జీహెఛ్ఎంసీ పరిధిలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ ఉదహరించారు.
కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో నిర్వహించాలని కేటిఆర్ సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావణం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్, ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని మంత్రి కేటిఆర్ తెలిపారు. సొంత వైద్యం మరింత ప్రమాదమని, జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశుభ్రతపై దృష్టి సారించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడం వలన రాష్ట్రంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. కరోనా వైరస్ ను ఎదుర్కునేందుకు ఇది దోహదపడుతున్నట్లు తెలిపారు. అత్యవసర సేవలను అందించుటకై 104, 108 వాహనాలే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కంటైన్మెంట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించుటకై కేబుల్ టి.విలు, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వాహనాలను స్వాధీనం చేసుకోవాలని తెలిపారు.
–>కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు 12 ప్రధాన అంశాలను అధికారులకు వివరించిన మంత్రి కేటిఆర్
- సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి.
- సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి.
- ఫీవర్ సర్వే కై పారమెడికల్ సిబ్బందిని నియమించాలి.
- శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి.
- నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి.
- పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి.
- ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి.
- ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి.
- సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి.
- కంటైన్మెంట్ జోెన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి.
- అత్యవసర వైద్య సేవలకై అంబులెెన్స్ ను సిద్దంగా ఉంచాలి.
- బియ్యాన్ని పంపిణీ చేయాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]