మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ మరియు రాచర్ల గొల్లపల్లి గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రూ.10.56 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
పేదవారి ముఖంలో చిరునవ్వు చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పేదవారికి ఆత్మగౌరవ ప్రతీకగా ఉండేలా సీఎం కేసీఆర్ ఇళ్ల నిర్మాణం చేపట్టి అందజేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నామని, దశల వారీగా పూర్తిచేస్తుమన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా,పైసా లంచం ఇచ్చే పనిలేకుండా, పారదర్శకంగా లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ స్థాయిలోనే గజం స్థలం రూ.లక్ష పలుకుతున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించిందని చెప్పారు. కోట్లు విలువైన భూముల్లో ఉచితంగా ఇళ్లు నిర్మించి, పైసా లంచం లేకుండా అందజేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వమని, పేదవారి ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం ఇళ్లు రానివారికి కూడా సంవత్సరంన్నరలో ఇళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు. త్వరలో 4.7 లక్షల రేషన్కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అలాగే బీడీ కార్మికులకు పింఛన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రము తెలంగాణ అని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ