హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పలు లింక్ రోడ్లను సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నగరంలో దూరప్రాంతాలను మరింత దగ్గర చేసేలా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఆర్డీసీఎల్)లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్న లింకు రోడ్లు వరుసగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.
అందులో భాగంగా నగరంలో నిజాంపేట క్రాస్రోడ్ నుండి హైటెక్ సిటీ జంక్షన్ (వయా వసంత్ నగర్-న్యాక్ 0.75 కీ. మీ), మియాపూర్ మెట్రో డిపో నుండి కొండాపూర్ జంక్షన్ (వయా ఐడీపీఎల్ ఎంఫ్లాయీస్ కాలనీ-శ్రీలా పార్క్ ప్రైడ్ రోడ్ 0.46 కీ.మీ), నోవాటెల్ నుంచి కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వరకు (0.6 కీ మీ), జేవీజీ హిల్స్ నుంచి మసీద్బండ (1.01 కీ.మీ), గచ్చిబౌలి ఐ.ఎస్.బి రోడ్ నుండి ఓ.ఆర్.ఆర్ (1.94 కి.మీ) వరకు అభివృద్ధి చేసిన లింక్ రోడ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ లింక్ రోడ్లు జెఎన్టియూ నుంచి హైటెక్ సిటీ రహదారిలో ట్రాఫిక్ రద్దీని తగ్గించనున్నాయి. అలాగే మియాపూర్, వసంత నగర్ మరియు కెపిహెచ్బి నుండి హైటెక్ సిటీ రోడ్ మరియు హఫీజ్పేట్ రోడ్ వరకు కనెక్టివిటీని మెరుగుపరచనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం అన్నివైపులా వేగంగా విస్తరిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ, మౌలిక వసతుల విస్తరణలో కూడా దూసుకుపోతున్నదని చెప్పారు. ఏ నగరానికైనా, రాష్ట్రానికైనా అభివృద్ధి సూచికగా నిలిచేది రహదారులని, హైదరాబాద్ నగరంలో జనాభా, జనసాంద్రత దృష్టిలో ఉంచుకుని రహదారులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రూ.6 వేల కోట్లతో ఎస్ఆర్డీపీ పనులు కింద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లు నిర్మించామని, మరొకవైపు రూ.1800 కోట్లతో సీఆర్ఎంపీ కింద పనులు చేపడుతున్నామని తెలిపారు. వీటికి అదనంగా హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద మొదటి దశలో రూ.313.65 కోట్లతో 22 లింకు రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, అందులో ఇప్పటికే 16 లింక్ రోడ్లను పూర్తి చేశామన్నారు. త్వరలోనే మరో 6 రోడ్లను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఇక రెండో దశలో రూ.65.94 కోట్లతో నాలుగు రోడ్ల నిర్మాణం ప్రారంభమైందని, వాటికీ అదనంగా రెండో దశను విస్తరిస్తూ రూ.230 కోట్లతో మరో 13 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ