తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు జహీరాబాద్ పర్యటనలో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ క్రమంలో నిమ్జ్లో వీఈఎం టెక్నాలజీస్ సంస్థకు భూమిపూజ చేశారు. నిమ్జ్లో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. సుమారు 511 ఎకరాల్లో రూ. 1,000 కోట్ల భారీ పెట్టుబడితో దీనిని నిర్మిస్తున్నారు. అనంతరం జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రూ. 1,000 కోట్ల భారీ పెట్టుబడితో వీఈఎం టెక్నాలజీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం సంతోషమని, ఈ పరిశ్రమ ఏర్పాటుతో దాదాపు రెండు వేల మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు.
వెమ్ టెక్నాలజీలో స్థానికులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని, అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ప్రకారం కంపెనీకి దగ్గరలో గల గ్రామాలలో ఏదేని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఇక పరిశ్రమలు పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉండాలన్న కేటీఆర్ దానికోసం ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ చట్టాలను అనుసరించి ఇక్కడ భూమి కోల్పోయిన రైతుల కుటుంబాలకు నిమ్జ్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ పెట్టాలని ఎన్నోసార్లు కేంద్రాన్ని కోరామని, అయినప్పటికీ దానిని బుందేల్ఖండ్కు కేటాయించారని తెలిపారు. దేశంలో అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల కన్నా మిన్నగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY