కొలువుదీరిన నాటి నుంచీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి హుందాగానే నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనూహ్య పంథాలో వెళ్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా బీఆర్ ఎస్ సభ్యులను సస్సెండ్ చేయాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న సమయంలో రేవంత్ మైక్ అందుకుని.. ప్రతిపక్షాన్ని సస్సెండ్ చేయబోమని.. వారు ఇక్కడు ఉండి.. నా ప్రసంగం వినాలని.. అదే వారికి శిక్ష అని ఆకట్టుకునే రీతిలో స్పందించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా తొలుత ప్రజాస్వా మ్యబద్ధంగా స్పందించింది. కొత్త ప్రభుత్వం కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, ఆరు నెలల వరకూ ప్రభుత్వాన్ని విమర్శించబోమని ప్రకటించింది. కానీ.. ఆరు రోజులు కూడా మాట మీద నిలబడలేకపోయింది.
కొలువైన రెండు, మూడు రోజులకే విమర్శలు మొదలుపెట్టారు. ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదంటూ ఒకరిద్దరు విమర్శించారు. స్పీకర్ ఎన్నిక నామినేషన్ రోజు స్వయానా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో తామూ చూస్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా రైతుబంధు తదితర పథకాలపైనా ప్రశ్నల వర్షం గుప్పించారు. అంటే వారం రోజులు కూడా గడవక ముందే విమర్శలు మొదలుపెట్టారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరుమాసాల సమయమిస్తామని, అప్పటి వరకు విమర్శించబోమని, వారికి అన్నీ సరిచూసుకునేందుకు, సర్దుకునేందుకు ఆపాటి సమయం అవసరమని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెబితే నిజంగానే ఎంత గొప్పవారు అని సాధారణ ప్రజలు సైతం అనుకున్నారు. ఎంతైనా పాలన చేసిన వారికే తెలుస్తుంది పరిపాలనలో కష్టాలేమిటో అని కితాబిచ్చారు.
కానీ మాటమీద బీఆర్ఎస్ పార్టీ నేతలు నిలబడలేదు. కేసీఆర్ తుంటి గాయంతో ఆస్పత్రి పాలయ్యారు. హరీష్రావు 48 గంటల్లోగా రైతుబంధు నిధులు జమచేయలేదని మొదలు పెట్టారు. కేటీఆర్ తానంతకంటే ఎక్కువే అన్నట్లు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత మెగా డీఎస్సీలపై ప్రకటనలేవీ అంటూ విరుచుకుపడుతున్నారు. ప్రశ్నించడం తప్పు కాదు కానీ కొంతైనా సమయం ఇచ్చి తగిన సందర్భంలో ప్రస్తావిస్తే హుందాగా ఉండేది. వాస్తవానికి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రేవంత్రెడ్డి ప్రజల ఊహలకందని విధంగా వివిధ కార్యక్రమాల అమలు ప్రారంభించారు. ఆయన పనితీరుకు ప్రజల నుంచి ఓవైపు ప్రశంసలు వస్తుంటే.. బీఆర్ఎస్ నేతలు చేసే వ్యాఖ్యానాలను ఆక్రోశాలుగా మాత్రమే ప్రజలు పరిగణిస్తున్నారు. కేటీఆర్ ప్రశ్నల్లో నిజాలున్నప్పటికీ అక్కసు మాటున అవి మరుగున పడే ప్రమాదం ఉంది. కాసింత సమయమిచ్చి ఉంటే మీకంటే ముందు ప్రజలే తమ గొంతులెత్తి ప్రశ్నించేవారు. అప్పడు మీ బలం మరింత పెరిగేది.
కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ‘అధికారంతమున చూడవలె అయ్యగారి సౌభాగ్యముల్’ అన్న పద్యాన్ని కొందరు గుర్తు తెచ్చుకుంటున్నారంటే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరముందన్న మాట!ఉదాహరణకు సిద్ధరామయ్య వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోను తిరిగి ట్వీట్ చేసేముందు ఐటీ మినిస్టర్గా పనిచేసిన మీరు నిజమో, నకిలీయో తేల్చుకోకుండా తొందరపడటం ఎదుటివారి మీద ఆక్రోశం, అక్కసునే చాటుతున్నాయని.. అధికారం లేకుంటే ఉండలేకపోతున్నారని చాలామంది భావించేందుకు అవకాశమిచ్చింది. దాంతో మీరు బీజేపీకి బీ టీమ్ అని సిద్ధరామయ్య అంటించిన చురక ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆరుగ్యారంటీలేమయ్యాయి ? అబద్దపు హామీలతోనే కాంగ్రెస్ గెలిచింది వంటి వ్యాఖ్యానాలెన్ని చేసినా ఇంత త్వరితంగా ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి వ్యతిరేకంగా స్వేదపత్రంతో బీఆర్ ఎస్ సిద్దమవుతోంది. దీని ద్వారా తమపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారో.. లేదా ప్రభుత్వంపై దాడి చేస్తారో చూడాలి. రాజకీయ పార్టీగా ఆరోపణలను తిప్పికొట్టడం అవసరమే. కానీ.. ప్రతిపక్ష పార్టీగా కొత్తగా కొలువైన ప్రభుత్వ పథకాలు, చేయబోయే కార్యక్రమాలపై ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించరని గుర్తించాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE