గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వీరు సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో కలిసి ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అజీమ్ గొప్ప ఆలోచనతో మన రాష్ట్రంలో రూ. 300 కోట్లతో విప్రో పరిశ్రమ ఏర్పాటు చేశారని, దీని ద్వారా సుమారు 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని, అందులో 15 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారని పేర్కొన్నారు. అందునా కందుకూరు, మహేశ్వరం ప్రాంతానికి చెందిన 90 శాతం మంది యువతకు ఈ పరిశ్రమ వలన ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు.
మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ కంపెనీలో ఉత్పత్తిలో భాగంగా ఏర్పడే కాలుష్యం బయటకు విడుదల కాకుండా జర్మన్ సాంకేతికత ఉపయోగించనున్నారని కేటీఆర్ వెల్లడించారు. అజీమ్ ప్రేమ్ జీ జీవితం యువతకు ఆదర్శప్రాయమని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన గొప్ప దార్శనికుడని, ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు ఆయన ఇన్స్పిరేషన్ అని అన్నారు. దేశవ్యాప్తంగా ఆయన స్థాపించిన కంపెనీలలో వేల మంది ఉపాధి పొందుతున్నారని గుర్తుచేశారు. ఇదివరకు 25 కోట్ల రూపాయలు హెల్త్ కేర్ కొరకు, కరోనా సమయంలో 12 కోట్ల రూపాయలు కోవిడ్ వ్యాక్సిన్స్ కొరకు, మరో 44కోట్ల రూపాయలు స్వచ్ఛంద సేవా సంస్థలకు అందించాని తెలిపారు.
తెలంగాణలో ఆసక్తిగల పారిశ్రామికవేత్తలకు టీఎస్ ఐపాస్ ద్వారా అనేక రాయితీలు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని, 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలోనే ఇలాంటి విధానం ఎక్కడా లేదని, సులభతర వాణిజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తోందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విప్రో కంపెనీ స్థాపించడం వలన 90 శాతం ఉద్యోగావకాశాలు ఈ ప్రాంతంలోని స్థానికులకు దక్కాయని తెలిపారు. వ్యాపారవేత్తలు పెట్టుబడులకోసం ఇప్పుడు తమ మొదటి గమ్యస్థానంగా హైదరాబాద్ వైపు చూస్తున్నారని, దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ