హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసన సభ నియోజకవర్గాల్లో జీహెఛ్ఎంసీ చేపడుతున్న పనులపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పార్లమెంటరీ పరిధిలో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. జీహెఛ్ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్.ఆర్.డి.పి కింద మంజూరు చేసిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ల విస్తరణ పనులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మంచినీటి సరఫరా పైప్లైన్ల నిర్వహణ, క్రీడా మైదానాల నిర్మాణం, నాలాల వెడల్పు తదితర మౌలిక వసతుల పనుల ప్రగతిని మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసి, ఎం.ఐ.ఎం శాసన సభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసి, డిప్యూటి మేయర్ మహ్మద్ బాబా ఫసియుద్దీన్, జీహెఛ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్, ఇంజనీరింగ్ విభాగాల చీఫ్ ఇంజనీర్లు, వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్లు, చార్మినార్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని వి.డి.సి.సి రోడ్లను అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో పైప్లైన్ల లీకేజీల వలన ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించడానికి దెబ్బతిన్న పైప్లైన్ల స్థానంలో కొత్త పైప్లైన్లు వేయాలని తెలిపారు. చివరి ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా చేయడం కోసం కొత్తగా పైప్లైన్లను నిర్మించాలని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో మురుగునీటి పారుదల వ్యవస్థను ఆధునీకరించడానికి నాలాల విస్తరణకు రూ 200 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 20 రోడ్లను వెడల్పు చేయుటకు, ప్రతిపాదిత మెట్రో రైలు మార్గంలో పనులు చేపట్టుటకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయుడానికి ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని జీహెఛ్ఎంసీ కమిషనర్కు సూచించారు.
రోడ్ల విస్తరణకు సానుకూలంగా స్పందించిన వారి ఆస్తులను వెంటనే సేకరించాలని, నిబంధనల ప్రకారం చెల్లింపులు జరిపి సంబందిత ఆస్తులను స్వాధీనం చేసుకొని నిర్మాణాలను కూల్చివేయాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. భూసేకరణలో పార్లమెంట్, శాసన సభ్యుల సహకారాన్ని తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్ల వెడల్పుతో ప్రజలు సంతోషిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆకాంక్షల మేరకు రోడ్ల వెడల్పు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల అభివృద్ది, సుందరీకరణ, బస్షెల్టర్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, పార్కుల, స్పోర్ట్స్ స్టేడియంల అభివృద్ది పనులను వేగంగా పూర్తిచేసేందుకు అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. రైల్వే అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి రైల్వే అండర్ పాస్ పనులను పూర్తిచేయాలని సూచించారు. ఈస్ట్ – వెస్ట్ కారిడార్లో భాగంగా మూసి నదికి ఇరువైపులా నాలుగు లేన్ల రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా స్థలాల అందుబాటును బట్టి గజ్వేల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్లను నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలలో ఆరోగ్య సంరక్షణ పట్ల శ్రద్ద పెరిగినందున పార్కులలో ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లేఅవుట్ ఓపెన్ స్పేస్లలో, పార్కులలో షీ-టాయిలెట్లు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్కు సూచించారు.