కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో తెల్ల రేషన్ కార్డులో ఉన్న ఒక్కొక్కరికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా అందజేయడంతో పాటుగా, తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి నిత్యవసర వస్తువుల నిమిత్తం రూ.1500 నగదు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 1న నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా, ఇక సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానంలో భాగంగా రాష్ట్రంలో 74 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో ఏప్రిల్ 14, మంగళవారం నాడు రూ.1500 జమ అవుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ప్రకటించారు.
ఇందుకోసం ఇప్పటికే రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసిందని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు 76 లక్షలకు పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు అనగా 87% కంటే ఎక్కువగా ఉచిత బియ్యం పంపిణీ పూర్తయిందని, మొత్తం 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విజయవంతంగా పంపిణీ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరా మంత్రి గంగుల కమలాకర్ కు మరియు సత్యనారాయణ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన ఆ శాఖ బృందానికి మంత్రి కేటిఆర్ అభినందనలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]