రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ రామారావు అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన అనేక కంపెనీల యాజమాన్యాలతో, పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తూ వారి సంస్థల విస్తరణకు రాష్ట్రాన్ని గమ్యస్థానంగా మారేలా మంత్రి కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ మరియు మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్ట్రానిక్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పెట్టుబడులకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా మరో రెండు ప్రముఖ సంస్థలు సంయుక్తంగా రాష్ట్రంలో కొత్త హెల్త్కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ తెలిపిన వివరాల ప్రకారం.. హెల్త్కేర్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 3ఎం హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (హెచ్ఐఎస్) మరియు హెల్త్కేర్ సపోర్ట్ సర్వీసెస్లో ప్రముఖ ప్రొవైడర్ అయిన ఈసీఎల్ఏటీ హెల్త్ సొల్యూషన్స్ సంయుక్తంగా కరీంనగర్లో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మేరకు వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ ప్రతినిధులు మంత్రి సమక్షంలో తెలంగాణ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. కాగా కరీంనగర్ కేంద్రంలో ఏర్పాటు కానున్న ఈ హెల్త్కేర్ సెంటర్.. కస్టమర్లకు మెడికల్ కోడింగ్ మరియు క్లినికల్ డాక్యుమెంటేషన్ వంటి సేవలను అందించనున్నది.
ఇక కరీంనగర్లో ఏర్పాటు చేయనున్న ఈసీఎల్ఏటీ ఆపరేషన్స్ సెంటర్లో ముందుగా 100 మందికి ఉద్యోగం కల్పించనున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల సంఖ్యను 200కు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరియు 3ఎం మరియు ఈసీఎల్ఏటీ మధ్య సహకారం కోసం ఆరోగ్య సంరక్షణ డెలివరీ, జనాభా ఆరోగ్యం కోసం సాంకేతిక ప్లాట్ఫారమ్లు, వైద్య పరికరాల తయారీలో మెరుగుదల వంటి అదనపు అవకాశాలను కూడా సమావేశంలో చర్చించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కాగా దాదాపు 40 సంవత్సరాలుగా, 3ఎం హెచ్ఐఎస్ సంస్థ ఆరోగ్య సంరక్షణ వర్గీకరణ మరియు చెల్లింపు పద్ధతులను అభివృద్ధి చేయడంలో తోడ్పాటు అందించడంతో పాటు దాదాపు 18 దేశాల్లో సేవలు అందిస్తుండటం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE