మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి శుక్రవారం సీబీఐ విచారణకు గైర్హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం కారణంగా ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని పేర్కొంటూ ఈ ఉదయం ఆయన పులివెందులకు బయలు దేరారు. ఈ మేరకు తన న్యాయవాదుల ద్వారా ఒక లేఖను సీబీఐ కార్యాలయానికి పంపించారు. అయితే ఈ నెల 16న కూడా ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ నోటీసులు పంపినా.. విచారణకు వెళ్ళలేదు. దీంతో సీబీఐ అధికారులు ఆ తర్వాత రోజు మరోసారి ఎంపీకి నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో నేటి విచారణకు కూడా అవినాష్ రెడ్డి గైర్హాజరవడంతో సీబీఐ అరెస్ట్ చేస్తుందనే అనుమానంతోనే ఆయన వెళ్లలేదని పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఎంపీ అనుచరులు కొందరు ఈరోజు కొన్ని మీడియా వాహనాలపై దాడికి దిగడంతో పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. వాస్తవానికి ఎంపీ ఈరోజు విచారణకోసమనే తన ఇంటి నుంచి బయలుదేరారని, అయితే ఆయన తల్లి ఆరోగ్యం బాగోలేదని సమాచారం అందిందని వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే అవినాష్ రెడ్డి పులివెందులకు పయనమయ్యారని తెలిపారు. ఇక అవినాష్ను సీబీఐ అధికారులు అరెస్టు చేస్తారనే వార్తలు ఊహజనితాలేనని, కావాలనే కొన్ని మీడియా సంస్థలు పనికట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అవినాష్ కారు వెనుక వెళ్తున్న మీడియాపై దాడి జరగడం దురదుష్టకరమని పేర్కొన్నారు. మీడియాపై అలా దాడి జరగకూడదని, అయితే దాడి విషయం అవినాష్కు తెలిసి ఉండకపోవచ్చునని అన్నారు. నాడు చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగిందని, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంటే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కాగా అవినాష్ రెడ్డి సీబీఐ ముందు సాక్ష్యం చెప్పడానికి ఇప్పటికే 5-6 సార్లు విచారణకు వెళ్లారని గుర్తు చేసిన సజ్జల, ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన సీబీఐ విచారణకు హాజరవుతారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE