కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. తెలంగాణలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్.. శుక్రవారం కామారెడ్డి జిల్లా బీర్కూరులో ఒక రేషన్ షాపు వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రికి కౌంటర్ ఇస్తూ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని సాకుతున్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, పన్నుల ద్వారా కేంద్రానికి రూ. 3,65,795 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని, దీనికి కేంద్ర మంత్రులు కూడా మినహాయింపు కాదని అన్నారు. రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫోటో లేదని జిల్లా కలెక్టర్పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని, రేషన్ దుకాణాల్లో ప్రధాని ఫోటోను పెట్టడమంటే, ప్రధానమంత్రి స్థాయిని తగ్గించడమేనని స్పష్టం చేశారు. అయినా రాష్ట్రంలోని పేదలకు మేము ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్నామని, దీనికి ప్రధాని ఫోటో ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు. అలాగే బాధ్యతాయుత స్థానంలో ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఎలా పడితే అలా మాట్లాడటం తగదన్న మంత్రి హరీష్ రావు.. ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరలేదని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, చేరినట్లైతే నిర్మలా సీతారామన్ రాజీనామా చేస్తారా? అని కౌంటర్ ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ