తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్ద కాలం అవుతున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పేద ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సచివాలయంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆదివాసీలకు పోడు భూముల పట్టాల పంపిణీ, నిమ్స్ విస్తరణ పనులు, గృహలక్ష్మి పథకం వంటి వాటిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల ప్రారంభం, అమలు సహా పర్యవేక్షణ తదితర అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పోడు భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీలకు జూన్ 24 నుంచి పట్టాలు అందించాలని, ఈ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని తెలియజేశారు.
ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక సూచనలు..
ఆదివాసీలకు పోడు భూముల పంపిణీ
- జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం.
- పోడు భూముల పట్టాల పంపిణీని వచ్చే నెల 24వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం.
- మొత్తం 4 లక్షల ఎకరాలకు సంబంధించి లక్షన్నర మంది గిరిజన రైతులకు హక్కు పత్రాలు అందించాలని నిర్ణయం.
- అర్హులైన రైతులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు, 295 మండలాలు, 2,845 గ్రామ పంచాయతీల పరిధిలో ఫారెస్ట్ రైట్ కమిటీల ఏర్పాటు.
- నూతనంగా పోడు పట్టాలు పొందే గిరిజనుల వివరాలు సేకరించి ‘రైతుబంధు’ వర్తింపచేయాలని ఆదేశాలు.
- పోడు భూముల పట్టాల యాజమానులకు ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ తెరిచి, నేరుగా రైతుబంధును జమచేసేలా చర్యలు.
- నూతనంగా పోడు పట్టాలు అందుకొనే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖకు అందజేయాలని సూచన.
- దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్కు సూచన.
- ఇక పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని చెప్పిన సీఎం కేసీఆర్.
నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులకు శ్రీకారం..
- వైద్యారోగ్య దినోత్సవం సందర్భంగా జూన్ 14న మొత్తం 33 ఎకరాల్లో రూ.1,571 కోట్లతో నిమ్స్ ఆస్పత్రి విస్తరణ పనులు ప్రారంభం.
- ప్రస్తుతం 1,489 పడకలు ఉండగా.. అదనంగా 2 వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణానికి శంఖుస్థాపన.
- మూడు బ్లాకులతో నిర్మించనున్న భవనంలో.. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు.
- ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్తులతో ప్రత్యేక బ్లాక్ నిర్మాణం.
- అలాగే ఇన్పేషెంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్ ఏర్పాటు.
- కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు.
- మొత్తం 2,000 పడకలలో.. 1200 ఆక్సిజన్ బెడ్లు, మరో 500 ఐసీయూ బెడ్లుగా ఏర్పాటు.
- మిగిలిన వాటిని, డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు ప్రత్యేకంగా గది కావాలనుకొనే రోగుల కోసం పేయింగ్ రూమ్స్గా కేటాయింపు.
గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు..
- సొంత జాగా ఉండి, ఇల్లు కట్టుకోవాలని భావించే పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు ‘గృహలక్ష్మి’ పథకానికి రూపకల్పన.
- రాష్ట్రంలోని పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించే గృహలక్ష్మి పథకాన్ని జూలైలో ప్రారంభించాలని ఆదేశం.
- ఇల్లు లేనివారితో పాటు గతంలో ఇల్లు ఉండి కూలిపోయినవారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని, దాని ప్రకారం అర్హులను గుర్తించాలని ఆదేశం.
- అలాగే పేదలకు ప్రభుత్వం ఇంటి స్థలం కోసం పట్టాలు ఇచ్చినవారికి కూడా వర్తిస్తుందని సూచన.
- ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాల్లో 4 లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయం.
- ఇవి కాకుండా మరో 43 వేల ఇళ్లు రాష్ట్ర కోటాలో మంజూరు చేయనుండగా.. ఇవన్నీ మహిళల పేరుమీదే మంజూరు చేస్తారని వెల్లడి.
- ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడి.
- రూ.3 లక్షల గ్రాంటును మూడు దఫాలుగా రూ.లక్ష చొప్పున లబ్ధిదారుడి ఖాతాలో జమచేయనున్నట్లు వెల్లడి.
- పునాది సమయంలో రూ.లక్ష, స్లాబు వేసిన తర్వాత రూ.లక్ష, నిర్మాణం పూర్తయ్యి సున్నాలు వేసే దశలో రూ.లక్ష అందజేయనున్నట్లు వెల్లడి.
- అలాగే జూలై నెలలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్కు ఆదేశాలు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE