భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది మరణించారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏప్రిల్ 7, మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. దేశంలో కరోనా వైరస్ కట్టడికి సలహాలు, సూచనలు కోరుతూ ప్రధాని మోదీ ఫోన్ చేసిన నేపథ్యంలోనే సోనియా గాంధీ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది.
సోనియా గాంధీ రాసిన లేఖలో ముఖ్యాంశాలు:
- కరోనాపై పోరు కొనసాగించేందుకు నిధుల సమీకరణ కోసం ప్రధాని మోదీ మరింత కఠినంగా వ్యవహరించాలి.
- నూతన పార్లమెంటు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ఆపివేసి అందుకు కేటాయించిన రూ. 20 వేల కోట్ల నిధులను కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పీపీఈ కిట్ల కొనుగోలుకు ఉపయోగించాలి.
- ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎంపీలు, గవర్నర్లు, జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది.
- టి.వీ., ప్రింట్, ఆన్లైన్ మీడియాలకు ప్రభుత్వం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో కరోనా సంబంధిత సమాచారానికి సంబంధించినవి తప్ప, మిగతా అన్నిరకాల యాడ్స్ను రెండు సంవత్సరాలపాటు నిలిపివేయాలి.
- ప్రభుత్వం కూడా 30 శాతం ఖర్చును తగ్గించుకుని రైతులు, కార్మికులు, చిన్న పరిశ్రమలకు కేటాయింపులు జరపాలి.
- కేంద్ర మంత్రులు, అధికారులు కూడా విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచన.
- పీఎం కేర్స్ నిధులను, పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్కు బదిలీ చేసి, పారదర్శకత పాటించాలి.
- కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థిస్తూ ప్రతి భారతీయుడు అండగా ఉంటున్నారు.