ట్రాఫిక్ రద్దీ రహితంగా తీర్చిదిద్దడానికి వ్యూహాత్మక రహదారుల అభివృద్ది పథకం (ఎస్.ఆర్.డి.పి) కింద చేపట్టిన ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ అండర్ బ్రిడ్జిలు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్ నిలుస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మే 28, గురువారం జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, మూసి రివర్ ఫ్రంట్ ఛైర్మన్/ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిలతో కలిసి ఉప్పల్, ఎల్బీనగర్ మార్గంలో కామినేని జంక్షన్ వద్ద రూ.44 కోట్లతో నిర్మించిన 2వ ఫ్లైఓవర్ను, ఎల్బీనగర్ జంక్షన్లో రూ.14 కోట్లతో నిర్మించిన అండర్పాస్ లను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, ప్రాజెక్ట్స్ ఎస్.ఇ రవీందర్ రాజు, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, డిప్యూటి కమిషనర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఎస్.ఆర్.డి.పి ప్యాకేజి -2 కింద రూ.448 కోట్ల వ్యయంతో చేపట్టిన 11 పనులలో ఇప్పటి వరకు రూ.268 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు తెలిపారు. అందులో ఐదు పనులను వినియోగంలోకి తెచ్చినట్లు వివరించారు. ఈ ప్యాకేజీలో భాగంగా చింతల్కుంట వద్ద అండర్పాస్, కామినేని వద్ద రెండు వైపులా ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్ జంక్షన్లో విజయవాడ వైపు వెళ్లే ఫ్లైఓవర్తో పాటు ఎల్బీనగర్ జంక్షన్లో అండర్పాస్లు పూర్తై ప్రారంభించడం జరిగింది. ఈ పనులతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో వాహనదారులు ఇక నుండి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, సిగ్నలింగ్ రహితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu