గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ‘మన పాలన- మీ సూచన’ మేథోమధన సదస్సులో భాగంగా మే 28, గురువారం నాడు పారిశ్రామిక రంగంపై చర్చించారు. రాష్ట్రంలో భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి చర్చ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో ఏపీకి నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు, జీఎస్టీ సహా అనేక పన్నుల్లో మినహాయింపులతో పాటు పలు పరిశ్రమలు వచ్చేవని చెప్పారు. ఎప్పుడు అవకాశం దొరికినా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని సీఎం అన్నారు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగేదని, ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలుస్తామని చెప్పామని, కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.
మౌలిక సదుపాయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బలం ఉందన్నారు. 972 కిలోమీటర్ల కోస్తా తీరంతో పాటుగా, నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్పోర్టులు ఉన్నాయన్నారు. వీటన్నింటికి మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ కూడా ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. అలాగే 1466 కంపెనీలు రూ.11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటుగా 20 కి పైగా ప్రముఖ సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu