రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మార్చ్ 4, బుధవారం నాడు సెట్విన్ సంస్థ నూతనంగా రూపొందించిన కోర్సుల బ్రోచర్ ను తన అధికార నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సెట్విన్ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతకు స్కిల్డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారికి ఉపాధితోపాటు ఉద్యోగాలను కల్పిస్తున్నామని అన్నారు. సెట్విన్ సంస్థ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటుగా తెలంగాణలోని వివిధ జిల్లాలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. సెట్విన్ సంస్థకు 24 స్వంత కేంద్రాలు, 57 ఫ్రాంచైజ్ ల ద్వారా 47 రకాల వృత్తి నైపుణ్య కోర్స్ లలో శిక్షణను అందించి, ఇప్పటివరకు సుమారు 4 లక్షల మంది యువతకు పైగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్ర ఐటీ, పురపాలక మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మారుతున్న పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా సెట్విన్ ఆధ్వర్యంలో బయోమెడికల్ ఇంజినీరింగ్ ఎక్విప్మెంట్ సర్వీసింగ్, ఆఫ్తాల్మాలజీ ఎక్విప్మెంట్ సర్వీసింగ్, పీసీబీ రిపేర్ టెక్నీషియన్, ఫైర్ అలారం ఇన్స్టలేషన్ అండ్ మెయింటెన్స్ కోర్స్ లను విద్యానగర్ లోని శిక్షణ కేంద్రంలో త్వరలో ప్రారంభిస్తున్నామని తెలిపారు. కోర్సుల డిమాండ్ ను బట్టి మిగిలిన కేంద్రాలకు కూడా విస్తరిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ ఎండీ వేణుగోపాల్, ట్రైనింగ్ మేనేజర్ నర్సింహ రావులు పాల్గొన్నారు.
[subscribe]