తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 4, బుధవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మార్చ్ 6వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ను సీఎం కేసీఆర్ ఆహ్వానించనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించనున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదయినా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ, వైరస్ ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అవగాహనా కార్యక్రమాలుతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు జాగ్రత్తలపై కూడా గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.
మరోవైపు మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజున ఉభయ సభలను(శాసన సభ, శాసన మండలి) ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. మార్చ్ 7వ తేదీన గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతుంది. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) మీటింగ్ లో చర్చించి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుతో పాటుగా, బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజుల పాటుగా నిర్వహించాలో కూడా నిర్ణయించనున్నారు.
[subscribe]