సనత్నగర్ నియోజకవర్గంలో మే 15, శుక్రవారం నాడు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. బల్కంపేట హిందూ శ్మశానవాటికలో ఆధునిక వసతులు కల్పించుటకు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ నిధులతో వాష్రూంల నిర్మాణంతో పాటు ప్రహరీగోడ నిర్మాణం, గ్రీనరి పెంపుదల, వాహనాల రాకపోకలకు అనువుగా రెండు గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మరో రెండు లేన్లతో వెడల్పు చేసేందుకు, బ్రిడ్జి రెండు వైపులా సర్వీస్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపారు. రైల్వే లైన్ పై నుండి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి విస్తరణ చేపడుతున్నందున రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిగ్నల్స్ను, కేబుల్స్ను కొంత వరకు మార్చాల్సి ఉన్నందున హెచ్.ఆర్.డి.సి.ఎల్ చీఫ్ ఇంజనీర్ వసంత, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ శ్రీదర్, సిసిపి దేవేందర్రెడ్డి, రైల్వే చీఫ్ బ్రిడ్జి ఇంజనీర్ కె.రామకృష్ణ, సీనియర్ డివిజనల్ ఇంజనీర్లు అమిత్ అగర్వాల్, అనిల్ కుమార్లతో చర్చించారు. అనంతరం సనత్నగర్ నుండి బాలానగర్ను కలిపే మిస్సింగ్ లింక్ రోడ్డును అభివృద్ది చేయుటకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. 100 అడుగుల వెడల్పుతో బాలానగర్, జీడిమెట్ల చౌరస్తా వరకు నాలుగు లేన్ల రోడ్డును అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో రైల్వే లైన్ ఉన్నందున నాలుగు లేన్ల రైల్వే అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ అంశాన్ని రైల్వే అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, సనత్నగర్లో ఫతేనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉన్నందున మరో రెండు లేన్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించుటకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు నగరంలో 54 లింక్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ పిరియడ్లో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు మేయర్ తెలిపారు. అదేవిధంగా సనత్నగర్, బాలానగర్, జీడిమెట్ల చౌరస్తా మధ్య వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు బాలానగర్ ఇండిస్ట్రీయల్ ఏరియా నుండి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా చౌరస్తా మద్య 100 అడుగుల నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణంతో పాటు ఆ మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. ఎర్రగడ్డకు కూడా 100 అడుగుల రహదారి విస్తరించనున్నట్లు తెలిపారు. జిహెచ్ఎంసి, హెచ్.ఆర్.డి.సి.ఎల్, టౌన్ప్లానింగ్, టి.ఎస్.ఐ.ఐ.సి రైల్వే అధికారులతో సమన్వయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల విస్తరణకు, మిస్సింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో సహకరిస్తున్న కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధమైన సహకారాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం ఫతేనగర్లో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ఉచిత భోజన కేంద్రాన్ని సందర్శించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu