కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకోవడంపై సమగ్ర నివేదిక రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం సమగ్ర నివేదికలతో డిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, ఇతర అధికారులను కలిసి నిధుల మంజూరుకు కృషి చేద్దామని చెప్పారు. జూన్ 1, సోమవారం నాడు మాసబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలోని తన చాంబర్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస రావు, పశు గాణాభి వృద్ది సంస్థ సీఈఓ మంజువాణి లతో ఆయా శాఖల కార్యకలాపాల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఈ సంవత్సరం కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని 24 వేల వివిధ నీటి వనరులలో సుమారు 88 వేల చేప పిల్లలు అవసరం ఉంటుందని, చేపపిల్లల కొనుగోలు కోసం టెండర్ల ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఎన్ఎఫ్డిబీ సహకారంతో ఏర్పాటు చేయనున్న ఫిష్ ఔట్ లెట్ నమూనాలు 2 రోజులలో సిద్ధం కానున్నాయని, వాటిని పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలలో 1962 సంచార పశువైద్య శాలల పనితీరును సమీక్షించాలని, ఆకస్మిక తనిఖీలు సైతం నిర్వహించాలని ఆదేశించారు. మాంసం సరఫరా, విక్రయాలపై నిరంతర పర్యవేక్షణ జరపాలని, ధరలు నియంత్రణలో ఉండే విధంగా చూడాలని అన్నారు. 33 జిల్లాలలో హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలకు పశుగణాభివృద్ది సంస్థ పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కమిటీల ఎన్నికకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని టిఎస్ఎల్డీఏ సీఈఓ మంజువాణిని ఆదేశించారు. విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింతగా పెంచేందుకు నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, వారం రోజులలోగా అందుకు సంబంధించిన నివేదికను సమర్పించాలని డెయిరీ ఎండీ శ్రీనివాస రావును ఆదేశించారు. లాక్డౌన్, వేసవి నేపద్యంలో పాల సేకరణ, సరఫరాపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu