మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాలను జీహెఛ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరిలతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శాంతికి చిహ్నం అయిన పావురాన్ని, బెలూన్ లను గాలిలోకి ఎగురవేశారు. సమన్వయ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 3కే రన్ లో గెలుపొందిన విజేతలకు మంత్రి సర్టిఫికేట్ లను అందజేశారు. అనంతరం వజ్రోత్సవాలలో భాగంగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ చిత్ర ప్రదర్శనను ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్ లో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించిన అనంతరం విద్యార్థులు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుమార్ కూర్మాచలం, ఎమ్మెల్యే దానం నాగేందర్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎఫ్డీసీ ఈడీ కిషోర్ బాబు, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, కార్యదర్శి దామోదర ప్రసాద్, ఐమ్యాక్స్ థియేటర్ నిర్వాహకులు రమేష్ ప్రసాద్ తదితరులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ, భగత్ సింగ్ వంటి అనేకమంది మహానీయులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి చేసిన పోరాటాలతోనే బ్రిటీష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా జరిపేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దేశ సమైక్యతను చాటే విధంగా ఇంటికో జాతీయ జెండా చొప్పున కోటి 20 లక్షల జెండాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ స్ఫూర్తిని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. 16వ తేదీన ఏకకాలంలో ఎక్కడి వారు అక్కడే సామూహిక జాతీయ గీతాలాపన చేయాలని కోరారు. 17వ తేదీన రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులలో దేశభక్తిని పెంపొందింప చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానీయుల గురించి తెలియజేయడం కోసమే తెలుగు, హిందీ, రెండు భాషలలో ప్రత్యేకంగా రూపొందించిన గాంధీ చిత్రాన్ని రాష్ట్రంలోని 563 స్క్రీన్ లలో విద్యార్థుల కోసం ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులను థియేటర్ల వరకు తీసుకెళ్లడం, చిత్ర ప్రదర్శన అనంతరం తిరిగి వారిని ఇంటికి చేర్చే ఏర్పాట్లను కూడా ప్రభుత్వమే చేసిందని మంత్రి తలసాని వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY