తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుధవారం కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మరియు కేంద్ర పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులతో న్యూఢిల్లీ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్య కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రం పాడి రైతుల పురోగతికి దోహదపడే కార్యక్రమాలను అమలు చేయుటలో మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇట్టి కార్యక్రమాల ద్వారా పాడి పరిశ్రమ రాష్ట్రం యొక్క స్థూల ఆదాయంలో 10% వరకు సహకారం అందిస్తుందన్నారు. సంచార పశు వైద్యశాలల గురించి వివరిస్తూ, అనారోగ్యం పాలైన పశువులకు ఇంటి ముంగిటే వైద్యం చేయటానికి ప్రతి గ్రామీణ నియోజక వర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ రాష్ట్రములో 100 సంచార పశువైద్యశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 2017లో ప్రారంభించిందని, ఇప్పటి వరకు 20,93,121 పశువులకు చికిత్స చేయడం జరిగిందని చెప్పారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి రూ.115.54. కోట్లు ఖర్చు చేసిందని తెలియజేశారు. రైతులకు ఇంకా సమర్థవంతంగా సేవలు అందించడానికి ఇప్పుడు పనిచేస్తున్న 100 సంచార పశువైద్యశాలలతో పాటు అదనంగా 100 సంచార పశువైద్య శాలను ఏర్పాటు చేయుటకు కేంద్ర ప్రభుత్వమును ఆర్థిక సహాయం కోరడం జరిగిందని తెలియజేశారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రం మొదటి విడతలో 19.98 లక్షల గొర్రెలను 380878 లబ్దిదారులకు 75 శాతం రాయితీపై అందించిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.3585.33 కోట్లు ఖర్చు చేసిందన్నారు.
రెండవ విడతకు రూ.4593.75 కోట్లు ఖర్చు చేయడానికి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పశు ఆరోగ్యం మరియు వ్యాధి నివారణ పథకంలో 190.63 లక్షల గొర్రెలకు, 49.34 లక్షల మేకలకు మరియు 84.58 లక్షల పశువులకు నట్టల నివారణ కార్యక్రమంకు రూ.48.34 కోట్లు ఖర్చు చేయుటకు ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని, ఇట్టి కార్యక్రమానికి కేంద్రం తన వాటా 60% కింద రూ.29.00 కోట్లు విడుదల చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు. టీకాల ఉత్పత్తి కేంద్రం (వేటరినరి బయోలాజికల్ రీసెర్చ్ యూనిట్) లో ప్రతి యేటా 240.10 లక్షల డోసుల టీకాలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఈ కేంద్రాన్ని బలోపేతం మరియు ఆధునికరణం చేయుటకు రూ.19.84 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించడం జరిగిందని, పశువులు, గొర్రెలు మరియు మేకలలో ఆరోగ్య శిబిరాలకు, రైతు ఆరోగ్య శిబిరాలకు రూ.5.08 కోట్లతో నివేదికను తయారుచేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ