మునుగోడుతో సహా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక, రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, విద్యుత్, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులపై అధికారులకు మంత్రులు దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం సహచర మంత్రులతో కలిసి మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మునుగోడు అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉపఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అన్నారు. మునుగోడులో ఆర్అండ్బీ డిపార్ట్మెంట్ ద్వారానే రాబోయే ఆరేడు నెలల్లో రూ.100 కోట్లతో రహదారుల విస్తరణతో పాటుగా, పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో రూ.170 కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు.
“మున్సిపల్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో చండూరు మున్సిపాలిటీకి రూ.30 కోట్లు, చౌటుప్పల్కు రూ.50 కోట్లు కేటాయిస్తున్నాం. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రూ.25 కోట్లతో ఆవాసాలకు రోడ్ల నిర్మాణం చేస్తాం. విద్యుత్ శాఖ ద్వారా కోత్తగా 33/11 ఐదు సబ్స్టేషన్లను రూ.8 కోట్లతో ఏర్పాటు చేస్తాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఎమ్మెల్యే, ప్రజల నిర్ణయం మేరకు చుండూరులో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. దండుమల్కాపూర్లో పారిశ్రామిక పార్కును ఆనుకొని ఈ ప్రాంత 10వేల మంది పిల్లలకు ఉపాధి కల్పించేందుకు టాయ్ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నాం” అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
“అలాగే చండూరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. తక్షణమే ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తాం. మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్న విధంగా సంస్థాన్ నారాయణపూర్ లో గిరిజన గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే సేవాలాల్ బంజారా భవన్ను సంస్థాన్ నారాయణపూర్ కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు రూ.కోటి మంజూరు చేసి, మునుగోడుకు అందుబాటులోకి తీసుకువస్తాం. కొత్తగా నాలుగు హ్యాండ్లూమ్ క్లస్టర్స్ను ఏర్పాటు చేస్తాం. భువనగిరి హెడ్ క్వార్టర్స్లో ఒకటి, నారాయణపూర్లో ఒకటి, గట్టుప్పల్లో ఒకటి, పెరటికల్లో ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తాం. నేతన్నలకు యార్న్ సబ్సిడీ విషయంలో కూడా సవరణలు చేసి, ఉత్తర్వులు ఇస్తాం. నల్గొండ జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పినట్లుగా, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ముందుకు వెళ్తున్నాం. రాబోయే 6 నెలల్లో వివిధ డిపార్మెంట్స్ కింద మొత్తం రూ.1,544 కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి చేయబోతున్నాం” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE