రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయేనని పేర్కొన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు యాగాలు చేయడం కొత్త కాదని, అయితే కొత్తగా పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి దైవబలం కావాలని, అందుకే ఈరోజు ఢిల్లీలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో మా అధినేత ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద పోటీకి కూడా సిద్ధమని అన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనకు ఆ అవకాశం ఇవ్వకపోతే అరవింద్ ఎక్కడ పోటీ చేసినా వెళ్లి ప్రచారం చేసి ఓడిస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే కేసీఆర్ జాతీయ స్థాయిలో పనిచేస్తారని, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని, చివరికి బతుకమ్మను కూడా అవమానిస్తున్నారని మండిపడ్డ కవిత త్వరలోనే వారు ఆయనకు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. ఇక తమ భారత్ జాగృతి ద్వారా దేశ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అలాగే బీజేపీయేతర శక్తులను ఏకం చేస్తామని తెలియజేశారు. ఆంధ్ర ప్రజలను ఎప్పుడు తాము తిట్టలేదని, కేవలం తెలంగాణను వ్యతిరేకించిన ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని కవిత గుర్తుచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ