ఒకే రోజు, ఒకే వేదికగా ఐదు వేల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురువారం నాడు పూర్తిచేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ లో వందలాది మంది కలిసి ఐదు వేల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా బాలీవుడ్ ఐరన్ మ్యాన్ అజయ్ దేవగన్ పాల్గొని ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు అజయ్ దేవగన్ కు చెందిన ఎన్.వై ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో జరిగిన ఈ కార్యాక్రమంలో వంద మంది పారిశ్రామిక వేత్తలు, నూటా పది మంది కళాకారులు, మూడు వందల మంది స్థానికులు పాల్గొని మొక్కలు నాటారు.
అభివృద్ధి ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరం: అజయ్ దేవగన్
“నాకు మొక్కలు, పచ్చదనం అంటే చాలా ఇష్టం. సమాజం వ్యాపారీకరణతో, కాలుష్యకారకంగా మారడం తీవ్రంగా కలచివేస్తోంది. అభివృద్ధి ఎంత అవసరమో, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే అవసరం. అందుకే నాకు తోచిన విధంగా ఎన్.వై ఫౌండేషన్స్ స్థాపించి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను. అన్ని వ్యవహారాల్లో లాభనష్టాలు చూసుకుంటున్న ఈ రోజుల్లో పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపంలో నిస్వార్థంగా పని చేస్తున్న ఎం.సీ సంతోష్ కుమార్ ను, ఆయన బృందాన్ని చూస్తే గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని అజయ్ దేవగన్ పేర్కొన్నారు.
తెలంగాణకు హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్: ఎంపీ సంతోష్
“తెలంగాణకు హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించాం. పర్యావరణంపై సమాజంలో మార్పు తీసుకొచ్చి భవిష్యత్ తరాలకు సమతూల్యమైన ప్రకృతిని అందించాలనే ఆశయంతో నిరంతరంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో అజయ్ దేవ్ గన్ కు చెందిన ఎన్.వై ఫౌండేషన్స్ తోడవటం మాకు మరింత బలాన్ని ఇచ్చింది. ఇక ముందు కూడా కలిసి వచ్చేవారితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకువెళ్తాము” అని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఇండస్ట్రియల్ పార్క్ లో ఒకే రోజు ఐదు వేల మొక్కలు నాటాము. ఈ పారిశ్రామికవాడను గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ గా, పచ్చదనంతో అభివృద్ది చేస్తామని పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బాలు మున్నంగి, రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ