మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఉపఎన్నికకు సన్నద్ధమవడంలో భాగంగా మునుగోడు నియోజకవర్గంలో ఆగస్టు 20వ తేదీన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా ఈ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా గురువారం ప్రగతి భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటుగా నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మునుగోడు ఉపఎన్నికపై చర్చించి, సభ నిర్వహణపై ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజా దీవెన పేరుతో నిర్వహించనున్న ఈ సభ కోసం మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కలిసి శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. అలాగే సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లపై దృష్టి సారించారు.
ముందుగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ కోమటిరెడ్డి రాజీనామాను ఆమోదించడంతో మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 21వ తేదీన చౌటుప్పల్ లో జరిగే సభలో బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ సభకంటే ముందుగానే మునుగోడులో భారీ సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఉపఎన్నికను ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రత్యేకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చుండూరులో ఓసారి కాంగ్రెస్ సభ నిర్వహించడంతో నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY