దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు. కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదని, వచ్చే మార్చి నుండి కొత్త పెన్షన్లు వస్తాయని తెలిపారు. శుక్రవారం రుద్రూరు మండలం సిద్దాపూర్, రాయకూర్ క్యాంపు, రాయకూర్ గ్రామాలలో జరిగిన రూ. 8.30 కోట్ల విలువైన శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ అభివృద్ధి కార్యక్రమాలలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలలో స్పీకర్ మాట్లాడుతూ, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే పది లక్షల మందికీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ల ద్వారా ఈ సహాయం అందిందన్నారు.
అలాగే వ్యవసాయానికి పెట్టుబడిగా ఎకరాకు పదివేల రూపాయల చొప్పున రైతుబంధు సహాయంగా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 66,370 మంది రైతులు ఉన్నారని, రైతుబంధు పథకం ద్వారా ఒక్కో సీజన్ కి ఆరవై కోట్ల చొప్పున ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలోకి వచ్చాయన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చనిపోయిన 1200 మంది రైతుల కుటుంబాలకు రైతుబీమా ద్వారా అరవై కోట్ల రూపాయలు అందాయన్నారు. రైతు బీమా సహాయాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు. ఆ నగదును కుటుంబ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలైనా, ధనికులైనా ఆత్మగౌరవం ఒక్కటే. అందుకే పేదల ఆత్మగౌరవం కాపాడటానికి డబుల్ బెడ్ రూం పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, రాష్ట్రంలో పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళు మంజూరు అయిన ఏకైక నియోజకవర్గం బాన్సువాడ అని తెలిపారు. ఇల్లు లేని పేదవారందరికి స్వంత ఇంటి కలను నిజం చేస్తానని, విడతల వారిగా పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేస్తామని చెప్పారు.
“అర్హులైన లబ్ధిదారుల అందరికి డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా సాగునీటికి డోకా ఉండదు. పేదల ఇంటి ఫంక్షన్లకు ఎక్కువ ఖర్చు కాకుండా అందరికీ అందుబాటులో ఉండే విదంగా నియోజకవర్గంలో 80 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మిస్తున్నాం. రాయకూర్ క్యాంప్ గ్రామ ముఖద్వారాన్ని స్వంత ఖర్చుతో నిర్మించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ స్థాయిలో సమగ్ర సమాచారంతో కూడిన ప్రొఫైల్ ఉండాలి” అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఒక ఎత్తు అయితే ప్రజా సమస్యలను తీర్చడానికి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం ఒక ఎత్తు అని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇంత పెద్ద ఎత్తున నిర్మించడం రికార్డు అవుతుంది. పదివేల ఇళ్ళు నిర్మించడం అందరికీ సాద్యం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం అనేది నాయకుల సమర్ధత, అపార అనుభవంతో మాత్రమే సాద్యం. స్పీకర్ పోచారం మాకు ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 360 స్కీంలు అమలు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడంతోనే ఇవన్నీ కళ్ళతో చూడగలుగుతున్నాం. గతంలో సాగునీరు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడుల కోసం రైతులు తల్లడిళ్లారు. సీఎం కేసీఆర్ ఆ సమస్యలను తొలగించి అసాద్యాన్ని సుసాధ్యం చేసారు. రాష్ట్రం సాదించడమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. ప్రభుత్వానికి ఉన్న పట్టుదల, చిత్తశుద్ధికి నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అని మంత్రి కొప్పుల పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ