జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిసెంబర్ 12, గురువారం నాడు రైతాంగ సమస్యలను బలంగా తెలియజేయడానికి ఒక రోజు దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షకు ‘రైతు సౌభాగ్య దీక్ష’గా నామకరణం చేశారు. ‘జనసేన రైతు సౌభాగ్య దీక్ష’ ప్రచార చిత్రాన్ని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గం ఇంచార్జ్ షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా చెప్పుకుంటామని, రాష్ట్రంలో సగటున 50 లక్షల క్వింటాళ్ల ధాన్యం ఏటా పండుతుంటే అందులో 25 లక్షల క్వింటాళ్ళు ఉభయగోదావరి జిల్లాలనుంచే పండుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితి నెలకుంటుంది, వరి పంటను వేయడానికి రైతులు భయపడేలా ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయని, గిట్టుబాటు ధరలు లేక, ఖర్చులు సైతం రాబట్టుకోలేక రైతులు అప్పులు పాలు అవుతున్నారని చెప్పారు. డిసెంబర్ 8, ఆదివారం నాడు తూర్పుగోదావరి జిల్లా మండపేట పరిసరాల్లో పర్యటించి రైతులతో స్వయంగా మాట్లాడానని, వారి దుస్థితిని వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే రైతు సౌభాగ్య దీక్ష చేయాలనీ సంకల్పించినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికీ అండగా నిలబడేందుకు చేపట్టనున్న ఈ దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలి రావాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కోరారు.
[subscribe]