హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కేబుల్ బ్రిడ్జిని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్(వారాంతం) సమయంలో ప్రజల తాకిడి ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వీకెండ్ సమయంలో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ కేబుల్ బ్రిడ్జికి సంబంధించి భద్రతా, ట్రాఫిక్ అంశాలపై సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సమీక్ష నిర్వహించారు. సందర్శకులు ఎక్కువుగా వస్తుండడంతో సమస్యలు ఏర్పడకుండా వీకెండ్ లో వాహనాలకు అనుమతి ఇవ్వకూడదని ఈ సమీక్ష సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయం నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జిపైకి వాహనాలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జిపై పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, పార్కింగ్, విద్యుత్ సరఫరా సహా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీపీ సజ్జనార్ సూచించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu