ఎనుముల రేవంత్ రెడ్డి.. అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. మండల స్థాయి నాయకుడిగా పొలిటికల్ జర్నీని ప్రారంభించి.. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే అధిరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పీఠమెక్కిన వారంతా.. ముందు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన వారే. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి కాకుండానే.. ఎటువంటి పరిపాలనా అనుభవం లేకుండానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా మంత్రి అవ్వకుండానే.. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. మోడీ తర్వాత మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి పదవి దక్కించుకొని రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు.
తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవమే తప్ప.. మంత్రిగా పనిచేసిన అనుభవం ఇంతకముందు లేదు. కానీ ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థవంతమైన నాయకుడనే గుర్తింపు మాత్రం ఉంది. అలాగే తన పనితనంతో సీఎం అవడానికి పరిపాలన అనుభవం అవసరం లేదన్న.. స్పష్టమైన నమ్మకాన్ని పార్టీ హైకమాండ్కు కలిగించారు. అందుకే ఆయన శక్తియుక్తులను గుర్తించిన కాంగ్రెస్ హైకమాండ్.. సీనియర్లను పక్కన పెట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.
అయితే ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ హైకమాండ్ క్లియర్గానే ఉంది. ఇందుకు నిదర్శనం ఆయన్ను ఎంపిక చేసిన విధానమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన 48 గంటల్లోనే రేవంత్ రెడ్డిని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా అధిష్టానం ప్రకటించింది. ఇంతక ముందు ఏ ఒక్క సీఎంను కూడా ఇంత తక్కువ సమయంలో ప్రకటించలేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించేందుకు కూడా ఇంతకంటే ఎక్కువ సమయమే తీసుకుంది హైకమాండ్.
అసలు ఫలితాలు వెలువడిన మరునాడే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రచారం జరిగింది. ఇందుకోసం రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో సీనియర్లు అడ్డుపడడంతో.. ప్రమాణస్వీకారం కాస్త ఆలస్యమయింది. ఏది ఏమయినప్పటికీ తెలంగాణలో మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా రేవంత్ రెడ్డి చరిత్రకెక్కారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY