తెలంగాణ ఆహార శుద్ధి పాలసీ, లాజిస్టిక్స్ పాలసీలపై చర్చించడానికి, గైడ్ లైన్స్ రూపకల్పనకు ప్రగతి భవన్ లో మంత్రులతో, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల మనకు ఆహార శుద్ధి రంగంలో వస్తున్న నూతన అవకాశాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి కృషి వల్ల తెలంగాణలో జల విప్లవం వస్తున్నది, లక్షలాది ఎకరాల బీడు భూములు కృష్ణా, గోదావరి నదుల నీటితో సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. ఈ జల విప్లవం తోడ్పాటుతో నీలి విప్లవం (మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ), శ్వేతా విప్లవం (పాడి పరిశ్రమ) కూడా తెలంగాణలో రానున్నాయి. రాష్ట్రంలో గొర్రెల పంపకం, చేప పిల్లల పెంపకం వల్ల రాష్ట్రంలో గొర్రెల సంఖ్య, చేపల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణలో ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లాలో ఏం పంటలు పండుతున్నాయి అనేది పూర్తిగా మ్యాపింగ్ చేశామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక వరి, పత్తి, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి బాగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న పంటలను పూర్తిగా ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం మనకు లేదు, దీనితో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి. అందువల్ల వెంటనే మనం ఈ ఆహార శుద్ధి రంగ పరిశ్రమలను ప్రోత్సహించాలి. తద్వారా మన తెలంగాణ రైతుకు ఆర్థిక స్వావలంబన, తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటిఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu