పెద్దపల్లి మాజీ ఎంపీ జి. వివేక్ ఆగస్టు 9, శుక్రవారం నాడు ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరారు. చేరికకు ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తో సమావేశమయ్యారు. త్వరలోనే పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరతారని ఈ సందర్భముగా వివేక్ బీజేపీ అధిష్టానంతో చెప్పినట్టు సమాచారం. ప్రధాని నరేంద్రమోడీ పాలన నచ్చడంతోనే బీజేపీలో చేరినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేస్తానని చెప్పారు.
ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నారని, అతనికి బీజేపీ పార్టీ తగిన సమాధానం చెబుతుందని చెప్పారు. గతంలో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి, తరువాత మాట తప్పారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీలో బలమైన ఉద్యమనేతలు ఉండకూడదనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమని వివేక్ చెప్పారు. వివేక్ బీజేపీ పార్టీలో చేరడం పార్టీకి మరింత ఊపునిస్తున్నదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వివేక్ గొప్ప నేపధ్యమున్న కుటుంబం నుంచి వచ్చారని చెప్పారు. త్వరలోనే మరింత మంది నాయకులు బీజేపీలో చేరతారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ తెలిపారు.
[subscribe]
[youtube_video videoid=pyUzeeHB2Ts]