తెలంగాణలో ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి. బృహస్పతి మీనరాశిలోకి ప్రవేశించిన సమయంలో నదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చే గోదావరిలో ప్రాణహిత నది కలుస్తుంది. గోదావరి నదికి గల ప్రధాన ఉపనది ఈ ప్రాణహిత. కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, సరస్వతితో కలిసి త్రివేణి సంగమంగా రూపొందుతుంది. పూర్వకాలంలో ప్రణీతుడు అనే మహాముని ఇక్కడ తపస్సు చేయడంతో ఈ నదికి ఆయన పేరు వచ్చిందని ప్రతీతి. తెలంగాణతో పాటు అటు మహారాష్ట్రలో కూడా ప్రాణహిత పుష్కరాలు జరుగనున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో.. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తుండగా, ప్రాణహిత నదికి అవతలి వైపు మహారాష్ట్ర అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట వద్ద పుష్కరిణికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల అనంతరం మంత్రి ఇంద్రకరణ్ దంపతులు పుష్కర స్నానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ విఠల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణహిత పుష్కరాల సందర్భంగా 13 నుంచి 24 వరకు మంచిర్యాల కేంద్రంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. మంచిర్యాల, చెన్నూర్ నుంచి అర్జునగుట్ట, సిరోంచ వరకు బస్సులు నడుస్తాయి. మరికొన్ని ప్రత్యేక బస్సులు కూడా నడుపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 2010లో చివరిసారిగా ప్రాణహిత పుష్కరాలు జరిగాయి. అప్పటితో పోల్చితే ఈసారి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో భక్తులకు రవాణా సౌకర్యాలు, వసతులు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ